Health Centre Inauguration
ఆకేరు న్యూస్,రాయపర్తి: మండలం కొత్తూరు గ్రామంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ ఎచ్ ఎం) నిధుల నుంచి రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం అదే గ్రామంలో మహిళల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మహిళా సమైక్య భవనానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ భవనం మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
తదనంతరం మండలంలో కొనసాగుతున్న సర్ (SIR) కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు.
కార్యక్రమం అమలు తీరును, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
