
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ‘‘అభివృద్ధి – సంక్షేమం రెండిరటినీ సమతుల్యం చేసుకుంటూ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై మాకొక స్పష్టమైన విజన్ ఉందని.. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్.. వంటి లక్ష్యాలను నిర్ధేశించుకున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు మా నినాదం రైజింగ్ తెలంగాణ. చైనా ప్లస్ వన్ కంట్రీకి సరైన మార్గంగా చైనా ప్లస్ తెలంగాణ చూపిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ (Indian Express) నిర్వహించే AddA కార్యక్రమంలో భాగంగా Revanth Reddy’s Rise : A Game Changer for Telangana పేరుతో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయంకా గారు, డిప్యూటీ ఎడిటర్ లిజ్ మ్యాథ్యూ ముఖ్యమంత్రితో దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ రాజకీయాలు, నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ఎదురవుతున్న పరిస్థితులు, తెలంగాణ ఎజెండా, రాష్ట్ర సమతుల అభివృద్ధి, ప్రభుత్వ లక్ష్యాలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టంగా వివరించారు.
నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఆ ప్రక్రియకు ప్రాతిపదిక ఏంటన్నది ముందు నిర్ధేశించాలి..దానిపై చర్చ జరగాలి.. ప్రాతిపదిక నిర్ణయించిన తర్వాత ప్రక్రియ చేపట్టాలి. లేదంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఉత్తరాది, దక్షిణాది అన్న వాదన తెరమీదకు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం. సుపరిపాలన అందించడం మా విధానమని తెలిపారు. తెలంగాణలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోందని.. సంక్షేమ ఫలాలు అసలైన అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలని.. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేమని.. అందుకే కులగణన చేపట్టామని తెలియజేశారు. దేశవ్యాప్తంగా కూడా ఓబీసీ గణాంకాలు తేలాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు జరగాలన్నారు. జనాభా లెక్కల సందర్భంగానే కేంద్రమే ముందుకొచ్చి ఓబీసీ గణాంకాలను కూడా సేకరించాలన్నారు. ఓబీసీ గణాంకాలు సేకరించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని గుజరాత్కు మళ్లిస్తున్నారన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమ అందుకు ఉదాహరణ. గుజరాత్కు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు కానీ ఒక గుజరాత్ ప్రధానమంత్రి కాదు కాద దేశ ప్రధానమంత్రి ఒక జడ్జిలా ఉండాలి. ఆటలో రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదు. ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోవద్దు. ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదన్నారు.
…………………………………