
* సీఎం సభలో మంత్రి పొంగులేటి
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని, మార్పు కావాలని మొదట నమ్మిన అడ్డా.. వరంగల్ గడ్డ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరంగల్ లో జరిగిన సీఎం సభలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇదే గడ్డ మీద రైతు డిక్లరేషన్ ఇచ్చారని, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ లోనే దేశంలో ఏ రాష్ట్రం పెట్టని విధంగా అత్యధికంగా 72 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో పెట్టడమే కాకుండా, రైతన్న కు ఇచ్చిన ప్రతీ మాటనూ చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. మహిళా అభ్యున్నతికి చిహ్నంగా ఈ సభను నిర్వహించడం సంతోషమన్నారు. ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు 22 జిల్లాలకు సంబంధించిన ఇందిరా మహిళా శక్తి భవనాలకు రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.దేశ చరిత్రలో మహిళ సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తున్నది ఇందిరమ్మ ప్రభుత్వమన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే..
మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ ఆడబిడ్డకు 500కే గ్యాస్ ఇస్తామని చెప్పి.. ఉమ్మడి వరంగల్ జిల్లాకే 5, 85,000 మంది మహిళలకు సుమారు 104 కోట్లను ఆడబిడ్డల ఖాతాలో వేశామన్నారు. 5, 27,000 మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కింద 128 కోట్లు ఇప్పటికే లబ్ధి జరిగిందన్నారు. రాజీవ్ ఆరోగ్యని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. ఈనెలలో వచ్చినవి తప్పా.. ఎక్కడా ధరణి అప్లికేషన్లు పెండింగ్ లేవని తెలిపారు. పేదల భూముల పరిరక్షణకు కొత్త రెవెన్యూ చట్టాన్ని అతికొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. 2 కోట్ల 54 లక్షల ఎకరాల భూమి పరిరక్షణకు పాటు పడతామన్నారు.కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించాలనే సోయి కేసీఆర్ కు లేదన్నారు. గత జూన్లో రేవంత్ రెడ్డి వరంగల్కు వచ్చినప్పుడు, ఎంత డబ్బైయిన పర్వాలే, యుద్దప్రాతిపదికన క్షేత్రాన్ని పూర్తి చేస్తామని చెప్పి, సుమారు 95 కోట్లు వెచ్చించి పూర్తి చేశారన్నారు. అలాగే వరంగల్ మాస్టర్ ప్లాన్.. మూడు విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. భద్రకాళీ ఆలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ. 35 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు 5, 213 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు.
…………………………………………………………………