
* పైసలు వసూలు చేస్తే సహించేది లేదు.
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం
ఆకేరున్యూస్, హన్మకొండ: ప్రభుత్వ పథకాల అమలులో లీడర్ అయినా క్యాడర్ అయినా పైసా వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని, ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి ముగుస్తున్న క్రమంలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు అయ్యాయని, మంజూరు కొరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. ప్రతి డివిజన్ పరిధిలో ఉన్న నిజమైన అర్హులను ఎంపిక చేసి, ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ఉండేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నాయకులు వార్డులలో ప్రతిరోజూ పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు,నాకు నాయకులు వారధిగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినా, పైసలు వాసులు చేసినా సహించేది లేదు.. అని అన్నారు. గడిచిన 14 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి,రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. సమస్యాత్మక గొడవలు, భూ పంచాయితీ సమస్యలపై నాయకులు ఆసక్తి చూపుతున్నారని మండిపడ్డారు. తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్, మామిండ్ల రాజు, సయ్యద్ విజయ శ్రీ రాజాలి, మానస రాంప్రసాద్, నెక్కొండ కవిత కిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మా రెడ్డి, అంబేద్కర్ రాజు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్, జిల్లా ఆర్టీఏ సభ్యులు పల్లకొండ సతీష్, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నేతలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
…………………………………..