
* ఆశ పెట్టి.. ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు
* ఏడాదిలో ఏకంగా 2000 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
* విద్యావంతులే ఎక్కువగా సమర్పించుకుంటున్నారు..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ..
హైదరాబాద్లో విద్యావంతులు ఎక్కువ. చాలా మంది తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ కూడా మాట్లాడగలరు.. అబ్బో ఇంకేముందు చాలా తెలివైన వాళ్లే అనుకుంటున్నారా? ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నవారిలో అలాంటి వారే ఎక్కువగా ఉంటున్నారు. బహుళ లాంగ్వేజీలు వచ్చినవారు ఉండడాన్ని నేరగాళ్లు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. వల వేసి వారి ఖాతాల్లోని సొమ్ము ఊడ్చేస్తున్నారు. చిలక పలుకులతోటి.. అధిక సంపాదన ఆశపెట్టి.. అదీ కుదరకపోతే భయపెట్టి.. మొత్తంగా హైదరాబాదీలపై టార్గెట్ పెట్టి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాల ద్వారా 2024లో సుమారు 2 వేల కోట్లు ( రూ.1,866.9 కోట్లు) దోచేశారు.
రాజధానిపై సైబర్ నీడ
దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు టెర్రర్ పుట్టిస్తున్నాయి. దేశంలోని ఒక్క తెలంగాణలోనే ఏడాదిలో 2000 కోట్లు దోచేశారంటే.. దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్లు కొట్టేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో గతేదాడి రూ.778 కోట్లను సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తే.. ఈ ఏడాది ఆ దోపిడీ రూ.1866.9 కోట్లకు చేరిందంటే రాష్ట్రాన్ని ఏ రీతిలో టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం ఒక ఎత్తయితే అందులో రాజధాని హైదరాబాద్ను సైబర్ నీడ కమ్మేస్తోంది. హైదరాబాదీలే లక్ష్యంగా నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ పెట్టుబడి పడితే రూ. లక్షల్లో లాభాలు వస్తాయని, స్టాక్ ఎక్సేంజ్ రంగంలోకి దిగితే దిమ్మతిరిగే డబ్బు మీ సొంతమని ఉద్యోగులను ఉచ్చులోకి లాగుతున్నారు. రూ.కోట్లలో కొట్టేస్తున్నారు. అలాగే.. పార్ట్ ఉద్యోగాలంటూ వల వేస్తున్నారు. మరికొందరిని డిజిటల్ అరెస్టు బెదిరించి దోచుకుంటున్నారు, అలాగే.., డెబిట్/క్రెడిట్ కార్డుల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.
56 శాతం ఉద్యోగులే
సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్ 5 లో ఉంటే.. రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉన్నట్లు పోలీసుల వార్షిక నివేదికలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్లోని విద్యావంతులనే నేరగాళ్లు మోసం చేస్తున్నారు. పెట్టుబడులు, స్టాక్స్ మోసాల్లోని బాధితుల్లో ఉన్నత స్థాయి విద్యావంతులు, ఉద్యోగులే ఉంటున్నారు. అత్యాశకు పోయి కోట్లాదిరూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం.. 2024లో మోసపోయిన బాధితుల్లో 56 శాతం ఉన్నతస్థాయిలో ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, 10 శాతం స్వయం ఉపాధి రంగం వారు, 9 శాతం విద్యార్థులు, వ్యాపారులు, 5 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 25,112 కేసులతో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొదటి వరుసలో ఉంటే.. 20,299 కేసులతో హైదరాబాద్ ఉంది. రాచకొండలో 14,815 కేసులు, వరంగల్ లో 3,531 కేసులు, సంగారెడ్డి 3,132 కేసులు నమోదయ్యాయి.
రికవర్రీ…
ఏటేటా సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్న సొత్తు పెరుగుతుంటే.. రికవరీ చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది. నేరగాళ్లు ఇతర దేశాలు, నగరాల్లో ఎక్కడో ఉండి.. ఫేక్ ఐడీలు, ఫోన్ నంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ లింకులు, ఆకర్ణణీయ మాటలతోనే అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ ఏడాదిలో రూ.1,866.9 కోట్ల సొత్తును నేరగాళ్లు దోచేస్తే.. పోలీసులు కేవలం 176.71 కోట్ల రూపాయలు మాత్రమే రికవరీ చేయగలిగారు. బాధితులు గోల్డెన్ అవర్లో 1930కు ఫోన్ చేస్తే.. మీ ఖాతాలోని సొమ్ము.. సైబర్ ఖాతాల్లోకి వెళ్లకుండా.. ఫ్రీజ్ చేయగలమని పోలీసులు చెబుతున్నా…, ఆ సమయంలో మేల్కొనే వారు చాలా తక్కువ మందే ఉంటున్నారు. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా చాలా మందికి ఫిర్యాదు చేసే విధానం తెలియకపోవడంతో పుణ్యకాలం గడిచిపోతుందని అంటున్నారు.
…………………………………………………..