
* ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకుండా డిఎస్సీ
* సీఎం రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు
* రేపు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలకు మందకృష్ణ పిలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసనలకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మందకృష్ణ ప్రశ్నించారు. వర్గీకరణ చేయకుండానే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి, ధర్నా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్లేట్ల వరకు ర్యాలీలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాలి. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ నుంచి బషీర్బాగ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. రేవంత్ సర్కార్ తమకు నమ్మక ద్రోహం చేసిందని మందకృష్ణ ధ్వజమెత్తారు. మాదిగలకు సీట్లు తగ్గడానికి కూడా రేవంత్ రెడ్డినే కారణం అన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. అసెంబ్లీలో ప్రకటించిన మాదిరిగా.. రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్ బాగ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని.. మాదిగలను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆచరించడం లేదని.. మాలల పక్షాన నిలుస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్గా మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చి.. మాలలకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో మాదిగలకు నాలుగు సీట్లు తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. వివేక్, వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా.. వంశికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. పార్టీ మారి వచ్చిన వివేక్ కుటుంబంలో రెండు సీట్లు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి వాళ్లతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కడియం శ్రీహరిని తానే ఆహ్వానించానని రేవంత్ రెడ్డే చెప్పారని.. సిట్టింగ్ ఎంపీ అయిన పసునూరు దయాకర్కు టికెట్ రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను తొలుత దేశంలో అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అర్ధ గంటకే రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారని తెలిపారు. అయితే రెండు నెలలు కాకముందే రేవంత్ రెడ్డి మాదిగలకు వెన్నుపోటు పొడిచారని విరుచుకుపడ్డారు.
ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఎలాంటి నియామకాలు జరపవద్దని కోరామన్నారు. వర్గీకరణ లేకుండానే రేపు 11 వేల ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేస్తున్నారన్నారు. మాల సామాజికవర్గానికి చెందిన మల్లిఖార్జున్ ఖర్గే, కొప్పుల రాజు ఆగ్రహానికి గురై పదవి కోల్పోవాలా అని రేవంత్ రెడ్డి మాదిగ ఎమ్మెల్యేలతో అన్నారని … అవసరమైతే త్వరలో ఆ ఎమ్మెల్యేల పేర్లు బయట పెడుతానని అన్నారు. రేవంత్ రెడ్డి మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీసీ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ను చూసి గర్వపడుతున్నానని.. దామోదర్ రాజనర్సింహను చూసి సిగ్గుపడుతున్నా అని అన్నారు. బీసీ సమావేశాలకు హాజరై కులగణన జరిగే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని పొన్నం ప్రభాకర్ గట్టిగా చెబుతున్నారన్నారు. బీసీల ప్రయోజనాల కోసం పొన్నం ప్రభాకర్ ధైర్యంగా మాట్లాడు తున్నారని చెప్పారు. మాదిగ కోటాలో మంత్రి అయిన దామోదర్ రాజనర్సింహ మాదిగల ప్రయోజనాల కోసం మాట్లాడటం లేదని మండిపడ్డారు. జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే వర్గీకరణ జరిగే వరకు ఉద్యోగ నియామకాలు ఆపాలని.. లేకపోతే బయటకు రా దామోదర రాజనర్సింహ అంటూ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
………………………………