
* పుష్కర సమాచార యాప్తో విస్తృత ప్రచారం నిర్వహించాలి
* దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
ఆకేరున్యూస్, కాళేశ్వరం: కాళేశ్వర మహా క్షేత్రంలో జరుగబోయే సరస్వతీ పుష్కరాల్లోభక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ప్రణాళికలతో ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. గురువారం కాళేశ్వరంలో మే 15 నుండి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితర అధికారులతో ఆమె గురువారం ఈఓ కార్యాలయంలో సమీక్షించారు. పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించారు. సరస్వతి విగ్రహం ఏర్పాటుకు స్థలం నిర్ణయించడం, విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు రహదారి నిర్మాణం, పురుషులు, మహిళల కోసం శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. గోదావరి హారతికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తిచేయాల్సిన శాశ్వత, తాత్కాలిక పనులకు ముందుగానే షెడ్యూల్ తయారు చేసుకోవాలని, సిబ్బందిని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అంచనాల్లో వ్యత్యాసాలు చేపట్టే పనులపై నివేదికలు రెండు రోజుల్లో అందజేయాలని సూచించారు. పుష్కర సమాచారం తెలిసేలా ప్రత్యేకంగా యాప్ తయారు చేయాలని, విస్తృత ప్రచారానికి అంబాసిడర్ ను నియమించాలని తెలిపారు. పుష్కర 12 రోజుల కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ తయారు చేయాలని ఈఓను ఆదేశించారు. ఎండ వేడి దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం గోదావరిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరిలో నీటి నిల్వలను పరిశీలించాలని తెలిపారు. సత్రం పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రముఖ ప్రాంతాలలో ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. గోదావరిలోకి భక్తులు వెళ్ళకుండా ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అంతకు ముందు విఐపి ఘాట్, గోదావరి ఘాటు వద్ద చేపట్టనున్న పనులను, సత్రం పనులను పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజినీరింగ్ శాఖల ద్వారా చేపట్టనున్న పనుల ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, ఎస్పీ కిరణ్ ఖరే, దేవస్థానం ఆర్జేసీ రామకృష్ణారావు, పంచాయతిరాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, దేవస్థానం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
……………………………..