* విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలి
* స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలపై దృష్టి సారించండి
* సీఎల్పి భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్త, పాత నేతలు సమన్వయంతో సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో కొత్త పాత నేతలు సమన్వయంతో సాగాలని సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా బీసీ కులగణన చేపట్టామని, ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేద్దామని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే సమస్యలపై ఎమ్మెల్యేలు నేరుగా తనను కలుసుకోవచ్చని అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డిలో జరిగిన సీఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విజయమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మరింత దృఢంగా నిలిచేలా చేస్తుందని, అందుకే ప్రతి నియోజకవర్గం స్థాయిలో సమర్థవంతమైన ఎన్నికల ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ ప్రభుత్వ పథకాలను గట్టిగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా.. సీఎల్పీ సమావేశానికి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, సంజయ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు కాలేదు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం, కేసు సుప్రీంకోర్టులో ఉండటం.. టెక్నికల్గా ఏ సమస్యా రాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా వీరు గైర్హాజరైనట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాదాపు ఐదున్నర గంటల పాటు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
…………………………..