* కోర్టులకు బాంబు బెదిరింపు…
* పరుగు తీసిన న్యాయవాదులు!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలు న్యాయస్థానాలకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ మెయిల్స్తో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లోని కోర్టు ప్రాంగణాలు ఉలిక్కిపడ్డాయి.హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. కోర్టు ఆవరణలో బాంబులు ఉన్నాయన్న వార్త తెలియగానే.. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు కక్షిదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి.కేవలం హైదరాబాద్లోనే కాకుండా, జిల్లాల్లోనూ ఈ బెదిరింపుల పర్వం కొనసాగింది.కరీంనగర్ జిల్లా కోర్టుకు ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. మధ్యాహ్నం 12:05 గంటలకు పేలుళ్లు సంభవిస్తాయని ఆ మెయిల్లో పేర్కొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీలోని రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు కూడా ఇలాంటి బెదిరింపులే రావడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.వరుసగా కోర్టులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపుల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ‘ఫేక్ కాల్స్’ గా భావిస్తున్నప్పటికీ, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని కోర్టుల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు.
