
* కేంద్రం అన్యాయంపై బీజేపీ తెలంగాణ ఎంపీలకు నిరసన సెగ
* ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఏమీ చేయలేకపోయారని విమర్శలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా.. అంటూ హైదరాబాద్లో వెలసిన ఫ్లెక్సీలుపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆయా ఫ్లెక్సీల్లో జీరో అంటూ అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని పెట్టి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు.. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలుగా గెలుపొందడమే కాకుండా, కేంద్ర మంత్రులుగా కీలకమైన పదవుల్లో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా రాష్ట్రానికి నిధులు ఇప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలకు ఎనిమిది మంది చొప్పున ఎంపీలున్నా సాధించిన నిధులు సున్నా.. అంటూ ఇరు పార్టీల ఎంపీలపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, ప్రధానంగా కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపైనే ఎక్కువగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కీలక ప్రాజెక్టులకూ “జీరో” నే..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్టులకు కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కలేదు. రూ.1.63 లక్షల కోట్ల కు ప్రతిపాదనలు పంపినప్పటికీ పైసా విదల్చలేదు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, మూసీ పునర్జీవం, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రధానంగా మెట్రో రెండో దశ డీపీఆర్ కు అనుమతి ఇవ్వడమే కాకుండా, తన వాటా నిధులు 18 శాతం కేటాయించాలని విన్నవించింది. గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని ఆశించింది. కానీ.. నిరాశే మిగిలింది.
ఇదే కారణమా..?
రాష్ట్ర ప్రాజెక్టుల ప్రస్తావన కేంద్ర బడ్జెట్ లో రాకపోవడం వెనుక కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. సరైన సమయంలో సరైన విధానంలో ఈ ప్రతిపాదనలు పంపలేదని పలువురు ఆర్థిక నిపుణులు, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బడ్జెట్ కసరత్తు మొదలయ్యే సమయంలోనే ప్రతిపాదనలు పంపాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. బడ్జెట్ కూర్పు తుది దశకు చేరుకున్న తర్వాత హడావుడిగా రూ.1.63 లక్షల కోట్ల ప్రతిపాదనలు అందించారని చెప్తున్నారు. ఇందులోనూ ప్రాధాన్యరంగాలను ఎంచుకోకుండా తలాతోక లేకుండా ప్రతిపాదనలను సమర్పించారని విమర్శిస్తున్నారు.
వారేం చేస్తున్నారు?
తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వారిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారైనా రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి నిధులు ఇప్పించాలి కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆమేరకు నిధులు కేటాయించలేదు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయి. గతంలో కంటే 12% పెరిగింది. అయినా రాష్ట్రంపై చిన్నచూపు చూశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు స్వప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తే.. బడ్జెట్లో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే, ఏడాది కాలంలో 30సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం సాధించారో ప్రజలకు చెప్పాలనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
………………………………………………………….