
* కేసీఆర్ దమ్ము ఒరిజినల్ కాంగ్రెస్ తెలుసు
* రేవంత్ హామీలపై సోనియాకు పోస్టు కార్డులు పంపాం
* బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha )విమర్శించారు. అబిడ్స్ జీపీవోలో ఎమ్మెల్సీ కవిత, జాగృతి కార్యకర్తలు పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు. మహిళలకు రూ.2500, పెన్షన్ల మొత్తం పెంపుపై పోస్టు కార్డు ఉద్యమం చేపట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కేసీఆర్ దమ్మెంతో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ (Telangana) వచ్చిందని అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి (Revanth reddy) ముఖ్యమంత్రి అయ్యారని, అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం అని కవిత అన్నారు. అబద్దాలు ఆడడం రేవంత్ రెడ్డికి అలవాటని, ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసిన దానిపై చర్చిద్దామని తెలిపారు. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు అని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.
……………………………………………………………….