
*అభ్యర్థుల ఎంపికపై సూచనలు
* ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దని ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం పీసీసీ ఛీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జిల్లాలకు సంబంధించిన ఇన్చార్జి మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలని సూచించారు. పీసీసీ లీగల్ టీమ్ నుంచి నామినేషన్ అప్లికేషన్కు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి పంపించాలని సూచించారు. గాంధీ భవన్లో లీగల్ అంశాలను నివృత్తి చేసేందుకు కో- ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని నేతలకు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారిని కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటివరకు వాటిపై రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసుపై పీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షణ చేయాలని సీఎం తెలిపారు. కోర్ట్ తీర్పు తరవాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రికి మరో సమావేశం ఉంటుందన్నారు. తొలి విడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
……………………………………………………………………….