
ఆకేరు న్యూస్, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. మాడుగుల మండలం నాగిల్లలో పలకరించేందుకు వచ్చిన బావమరిదిని బావ హత్య చేశాడు. దీంతో కోపోద్రోక్తులైన బంధువులు నిందితుడిని కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగిల్ల గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి మూఢ నమ్మకాలతో పదేళ్ల క్రితం తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ కేసులో జైలుకు వెళ్లిన యాదయ్య.. గతేడాది విడుదలయ్యాడు. ఈ క్రమంలో యాదయ్య బావమరిది శ్రీను నాగిల్లలో ఓ పెళ్లికి వచ్చాడు. దీంతో అదే గ్రామంలో ఉన్న బావ యాదయ్యను పలకరించేందుకు శ్రీను అతని ఇంటికి వెళ్లాడు. కానీ శ్రీనును చూసి అసహనానికి లోనైన యాదయ్య.. గొడ్డలితో శ్రీనును నరికి చంపాడు. అది చూసి మృతుడి బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. మృతుని బంధువులతో పాటు శ్రీను స్వగ్రామమైన యాచారం మండలం మేడిపల్లి గ్రామస్తులు యాదయ్యపై దాడికి దిగారు. దీంతో యాదయ్య కూడా అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………..