
* అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించిన మంత్రి కొండా సురేఖ, ఎంపి, ఎమ్మెల్యేలు
ఆకేరున్యూస్, వరంగల్: సమసమాజ స్వాప్నికుడు భారతరత్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో వరంగల్ పట్టణంలోని కాశిబుగ్గ జంక్షన్ వద్ద రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ లతో కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడతూ సమానత్వానికి శిల్పి, రాజ్యాంగానికి నేత, బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆయన ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకమేనని అన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం మనందరికీ స్ఫూర్తి దాయకమని, నేటి యువత ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా, హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో ఎంపి డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే లు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.
………………………………………..