
* వైద్యం తెలియకుండానే గుండె ఆపరేషన్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ నకిలీ డాక్టర్ ఏడుగురి ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఆయన గుండె ఆపరేషన్ చేసిన వారు ఒకే నెలలో ఏడుగురు చనిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి ప్రముఖ కార్డియాలజిస్ట్(Cardiologist)గా చెప్పుకుంటూ వైద్యం చేసేవాడు. నకిలీ పత్రాలతో దామోహ్లోని క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. పలువురు రోగులకు హార్ట్ సర్జరీ(Heart Surgery)లు చేశాడు. గుండె ఆపరేషన్లు చేయించుకున్న రోగుల్లో ఒకే నెలలో ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డాక్టర్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో న్యాయవాది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దీపక్ తివారీ ఆ డాక్టర్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. సర్జరీ తర్వాత మరణించిన రోగుల మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదేశంతో దర్యాప్తు బృందం ఆ క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిని సందర్శించింది. దర్యాప్తులో నకిలీ డాక్టర్ (Fake Doctor) అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తేలింది. హైదరాబాద్లో క్రిమినల్ కేసు నమోదుతో సహా పలు వివాదాల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ నకిలీ డాక్టర్తోపాటు రోగుల మరణాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
……………………………………….