Vinay Bhaskar Visit Vijayawada
అకేరు న్యూస్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని శనివారం రోజున ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న మాజీ చీఫ్ విప్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం వారు అంతరాలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి మంత్రపుష్పాలతో వేదాశీర్వచనం (ఆశీర్వాదాలు) పలికారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని వారికి బహూకరించి గౌరవించారు.
అమ్మవారి దర్శనం అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… “దుర్గమ్మ తల్లి కృపాకటాక్షాలతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించాను. అమ్మవారి దర్శనం అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరిగింది. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు, ప్రోటోకాల్ మర్యాదలు చాలా బాగున్నాయి” అని పేర్కొన్నారు.
