
* గాఢనిద్రలోనే ఆగుతున్న ఆయువు
* గుల్జార్ హౌజ్ ఘటన తీవ్ర విషాదం
* 17 మంది మృతితో సంచలనంగా ప్రమాదం
* ఎవరిదీ పాపం.. ప్రభుత్వానిదా.. యజమానులదా?
* గతేడాది 2,500 అగ్ని ప్రమాదాలు
* ఈ ఏడాదిలో ఇప్పటికే 450
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
సెలవుల్లో సరదాగా అమ్మమ్మ/నానమ్మ ఇంటికి వచ్చిన 8 మంది చిన్నారులు మంటల్లో మసై ఊపిరివదిలారు. కొద్దిరోజులు అమ్మనాన్నలతో గడుపుదామని వచ్చిన కుమారుడు, కుమార్తె నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇంటినిండా మనవళ్లు, మనవరాళ్లు, కుమార్తె, కుమారులు, సోదరుడు వారి కుటుంబసభ్యులతో అప్పటి వరకు హాయిగా గడిపిన ఆ ఇంటి పెద్దలు ఇద్దరూ.. ఊహించి ఉండరు. తెల్లారేసరికి మన బతుకులు తెల్లారిపోతాయని.. తమతో పాటూ తమ వాళ్లూ మాడి మసై పోతారని. ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది అగ్రిప్రమాదంలో అసువులు బాశారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్లో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఒక్క ఘటనే కాదు.. ఇలాంటి ఘటనలు ఏటా జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఎవరిదీ పాపం.. తమ వరకూ రాదులే అని చిన్న చిన్న అగ్నిమాపక నివారణ చర్యలూ చేపట్టని భవన యజమానులదా.., ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి.., కచ్చితంగా నిబంధనలు పాటించేలా చేయలేని ప్రభుత్వ యంత్రాంగానిదా.. అంటే తిలాపాపం.. తలా పిడికెడు అన్న సమాధానమే వస్తోంది.
అంతలోనే ఎంత విషాదం
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్హౌజ్ మొదటి అంతస్తులో ఆదివారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృత్యువాతపడటం రాష్ట్రంలో పెను విషాదం నింపింది. షార్ట్ సర్యూట్ వల్ల ఈ ఘోరం జరిగినట్టు తెలుస్తుండగా మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండటం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు చనిపోగా, ఆస్పత్రుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఆస్పత్రికి వచ్చే సరికే వీరిలో చాలా మంది చనిపోయారు వైద్యులు ప్రకటించారు. ఒకే కుటుంబంలో మూడు తరాలవారు ప్రాణాలు కోల్పోయారు. వ్యాపారి ప్రహ్లాద్ మోదీ, భార్య, అతడి కుమారుడు, కుమార్తె వారి పిల్లలు మొత్తం 10 మంది చనిపోగా, ప్రహ్లాద్ మోదీ సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు మరో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఆ రాత్రి వరకూ ఎన్నో ముచ్చట్లు, సంగతులు గుర్తు చేసుకున్న వారంతా తెల్లారేసరికి కానరాని లోకాలకు తరలిపోయారు.
జంటనగరాల్లో అగ్ని ప్రమాదాలు ఇలా..
హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఒక్క నగరంలోనే 2500 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారుగా 450 వరకు ప్రమాదాలు జరిగినట్లుగా తమ వద్ద నమోదయ్యాయని, ఇందులో ఎక్కువగా షార్ట్ సర్క్యూట్తోనే జరిగినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగిన ఘటన గుల్జార్హౌస్లో ఆదివారం జరిగిన ప్రమాదమేనని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా, అగ్ని మాపక రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారని అంటున్నారు.
ఏటా ఆరని చిచ్చు.. ప్రాణాలు బుగ్గి
ఏటా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో పౌరులు కోల్పోతూనే ఉన్నారు. గుల్జార్హౌజ్ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాగూడలోని పాషాకాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఒక చిన్నారితో సహా ముగ్గురు మృతిచెందారు. గత సంవత్సరం అక్టోబర్ లో యాకుత్పురలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. మరో పదిహేనేళ్ల బాలిక గాయపడింది. గత సంవత్సరం జూలైలో జియాగూడ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి చెందింది. నవంబర్ 2023లో నాంపల్లిలోని బజార్ఘాట్లో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో పదిమంది మరణించారు. 12 మంది గాయపడ్డారు. మార్చి 2023లో సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. జనవరి 2023లో సికింద్రాబాద్ మినిస్టర్స్రోడ్లోని నల్లగుట్ట వద్ద ఓ క్లాత్స్టోర్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు సజీవదహనమయ్యారు. సెప్టెంబర్ 2022లో సికింద్రాబాద్లోని పాస్పోర్టు ఆఫీసు సమీపంలో ఓ బహుళ అంతస్తుల కాంప్లెక్స్లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మార్చి 2022లో సికింద్రాబాద్లోని ఓ స్కాప్ గిడ్డంగిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో బీహార్కు చెందిన 11 మంది వలస కార్మికులు సజీవదహనమయ్యారు.
…………………………………………