
* నాటక పోటీలను నిర్వహించి.. కళాకారులకూ అవార్డులు
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పదేళ్లపాటు తెలంగాణలో నంది అవార్డులు ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy Cm Batti Vikramaraka) గత ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఉగాది నాడు గద్దర్ ఫిలిం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలను నిర్వహించి.. అవార్డులు కూడా ఇస్తామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి నేను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. రామదాసును స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది సంగీత విద్వాంసులు వాగ్గేయకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని చెప్పారు. భక్త రామదాసు 392 జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తుందన్నారు. ప్రతి యేటా తమిళనాడు తిరువయ్యూర్ లో జరిగే త్యాగరాజ(Bhakta Ramadasu Jayanti Celebrations) ఆరాధనోత్సవాల మాదిరిగా ఇకపై ప్రతియేటా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ డా. యెల్లా వెంకటేశ్వరరావు, పద్మశ్రీ డా. శోభారాజు, కళారత్న పురస్కార గ్రహీతలు హైదరాబాద్ బ్రదర్స్ (Hyderabad Brothers)రాఘవాచారి, హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ, ప్రేమా రామమూర్తి, కోవెల శాంత, డివి మోహన్ కృష్ణ తదితర ఉద్దండులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని ప్రముఖ వాగ్గేయ కళకారుడు గద్దర్ పేరిట గద్దర్ ఫిలిం అవార్డులను ఉగాదికి ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నాటక రంగంలో రాణిస్తున్న కళాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నాం అన్నారు. కొంత మందికి మాత్రమే కళలు సొంతం. భగవంతుడు ఇచ్చిన ఆ కళను ప్రజలకు పంచి కళాకారులు సమాజ వికాసానికి దోహదపడాలన్నారు.
………………………………………………