* దేవాదుల మోటార్లు ఆన్ చేయరా?
ఆకేరు న్యూస్, జనగామ/స్టేషన్ ఘనపూర్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ మోటార్లు ఆన్ చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గతంలో జిల్లా మంత్రులు ఇక్కడికి వచ్చి హడావుడి చేశారే తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు జరిగిన మేలు ఏమీ లేదని హరీష్ రావు విమర్శించారు. గతంలో కూడా ఇదే విధంగా మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల సుమారు 60 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా అదే పరిస్థితి పునరావృతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ వద్ద పంపింగ్ నిలిచిపోవడం వల్ల ప్రధానంగా జనగామ మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా, కీలకమైన దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు సాగునీరు అందక అల్లాడుతున్నారు” అని ఆయన మండిపడ్డారు.
