* నాలుగు రోజుల పాటు వానలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గురువారం మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ పేర్కొంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతూ రాబోయే 24గంటల్లో మరింత బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణ(Telangana)లో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్(Warangal), హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad), మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.
