Hyderabad Rowdy Sheeters Drug Tests
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నగర పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. నేరాలకు ప్రధాన మూలమైన మత్తు పదార్థాల నెట్వర్క్ను ఛేదించే క్రమంలో, పోలీసులు రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నగరవ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు డ్రగ్ పరీక్షలు నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
* 1300 మంది రౌడీషీటర్ల గుర్తింపు…
నగరంలో నేర ప్రవృత్తి కలిగిన వారిపై నిఘా పెట్టిన పోలీసులు, మొత్తం 1300 మంది రౌడీషీటర్ల జాబితాను సిద్ధం చేశారు. వీరందరినీ ఆయా పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, ఎవరూ ఊహించని విధంగా డ్రగ్ అనలిటికల్ కిట్స్ ద్వారా అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు.
* షాకింగ్ రిపోర్ట్స్: 190 మందికి పాజిటివ్…
తొలి విడతగా సుమారు 250 మందికి పరీక్షలు చేయగా, అందులో ఏకంగా 190 మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. అంటే పరీక్షించిన వారిలో దాదాపు 75 శాతం మంది మత్తు పదార్థాలకు బానిసైనట్లు స్పష్టమైంది. వీరిలో అత్యధికులు గంజాయి (Marijuana) వాడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. మత్తులో ఉన్న సమయంలోనే వీరు హత్యలు, దాడులు, బెదిరింపుల వంటి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.
* ముఠాల మూలాల కోసం వేట..
రౌడీషీటర్లకు ఈ గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? దీని వెనుక ఉన్న ప్రధాన డ్రగ్ పెడ్లర్లు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
* రీహ్యాబిటేషన్ వైపు అడుగులు
కేవలం శిక్షించడమే కాకుండా, వారిలో మార్పు తీసుకురావడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్కు బానిసైన వారిని డీ-ఎడిక్షన్ (రీహ్యాబిటేషన్) కేంద్రాలకు aa తరలించి, వారిని సాధారణ పౌరులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ఆపరేషన్ నగరవ్యాప్తంగా నిరంతరం కొనసాగుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
