
* నందమూరి బాలకృష్ణ
ఆకేరున్యూస్, హైదరాబాద్: మా నాన్న ఆశీర్వాదం వల్లే పద్మభూషణ్ వచ్చిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం బసవతారకం ఆస్పత్రిలో బాలయ్యకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను ఎప్పుడూ ఏదీ ఆశించి చేయలేదన్నారు. ఇది తన నాన్న ఆశీర్వాదం అని పేర్కొన్నారు. ఇలాంటి సన్మానాలు మరింత బాధ్యతను పెంచుతాయని పేర్కొన్నారు. నాకు వచ్చిన ఈ అవార్డు మీకు అందరికి వచ్చినట్లేనని.. ఈ రోజు నాకు వచ్చిన అవార్డు రేపు మీకు రావచ్చు. స్వంత లాభం కొంత మానుకొని సమాజం కోసం పని చేయాలన్నారు. వరుసగా నాలుగు సినిమాలు హిట్ అవటం, వరుసగా మూడుసార్లు గెలవటం, ఇప్పుడు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. మా అమ్మ ఆశయం కోసం ఎంతోమందికి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నామని.. సహకారం అందిస్తున్న దాతలకి, ప్రభుత్వాలకి, బ్యాంకర్స్కి కృతజ్ఞతలు తెలిపారు.
కళారంగానికి చేసిన సేవలు మరువలేనిది. దానికి గుర్తింపే ఈ గొప్ప అవార్డు అని.. ఏ సినిమా చేసినా ఎంతో ఆలోచించి చేస్తామని.. ఈ అవార్డు మా నాన్న, అమ్మకి అంకితం అన్నారు. అలాగే బసవతారకం హాస్పిటల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ డివెన్సీ ఎక్విప్మెంట్ను బాలకృష్ణ ప్రారంభించారు. శస్త్ర చికిత్సలో అత్యాధునిక వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, ఈ విషయంలో గర్వపడుతున్నామని పేర్కొన్నారు. 800లకు పైగా రోబోటిక్ సర్జరీలు చేశామని బాలకృష్ణ తెలిపారు. దేశంలోనే ఇన్ని రోబోటిక్ సర్జరీలు చేసిన ట్రస్ట్ ఒక్క బసవతారకం హాస్పిటల్ మాత్రమేనన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే యాభై శాతం తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నామన్నారు. రోబోటిక్ సర్జరీ ద్వారా క్యాన్సర్ రోగులు త్వరగా కోలుకుంటారని.. సంకల్పం, సేవ బలంతో ముందుకు సాగుతున్నామని బాలయ్య పేర్కొన్నారు.
………………………………………