
* ప్రజాస్వామ్యంలో సీఎం రేవంత్ చర్యలు సబబు కాదు
* జర్నలిస్ట్ రాజ్ కుమార్ను జైల్లో పరామర్శించిన మాజీ మంత్రి దయాకర్రావు
ఆకేరున్యూస్, జనగామ: సీఎం రేవంత్రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యంతో మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అక్రమ అరెస్టు చేసిన ఆర్జీ టీవీ యూట్యూబ్ జర్నలిస్ట్ రాజ్ కుమార్ను శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దయాకర్ రావు విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన కొడంగల్లోని లగచర్లలో అమాయక గిరిజన రైతులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డిది మొదటి నుంచి కక్షసాధింపు ధోరణి అని విమర్శించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గమైన పాలన చూడలేదని తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని కొండాపురానికి చెందిన కాంగ్రెస్ గిరిజన నాయకుడు శ్రీనివాసు తన భార్య కాపురానికి రావడం లేదంటూ పీఎస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంలో శ్రీనివాస్ను కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు పీఎస్లో అక్రమంగా కొట్టించడంతో తాను ఒంటిపై పెట్రోల్ పోసుకున్నట్లు డెత్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తొర్రూరుకు చెందిన ఓ గిరిజన యువకుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి ఇటీవల ప్రభుత్వ నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఆ యువకుడిని రెండు రోజులపాటు పీఎస్ లో పెట్టి కొట్టించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నిరుపేద కుటుంబానికి చెందిన ఆర్జీ టీవీ యూట్యూబ్ జర్నలిస్టు రాజ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో అనుకూలంగా పనిచేసిన వ్యక్తి. ప్రస్తుతం అతను ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన ఛానల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు ధోరణిలో ఆ జర్నలిస్టుపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. రాజ్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును విత్ డ్రా చేసుకొని వెంటనే అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
……………………………………………………