
ఆకేరు న్యూస్, పిఠాపురం
సంక్రాంతి పండుగకు ఏపీ పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. పందెం కోళ్లు ఒకవైపు.., గుండాటలు మరోవైపు.. జోరుగా జరుగుతుంటాయి. అదంతా ఒక ఎత్తయితే సంక్రాంతికి మర్యాదలు చేయడంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకత చాటుతారు. అదే విధంగా కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన సియాదుల సోమేశ్వరరావు, సీతారత్నం గారి ఇంట్లో ఎక్కడెక్కడో ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడి సంక్రాంతి పండగకి ఇంటికి వచ్చిన అల్లుళ్ళు, కూతుర్లు, కుమారులు, కోడళ్లు ,మనవళ్ళకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 8 అడుగుల విస్తరాకులో అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలతో వినూత్నంగా ఇంట్లోనే మండీ భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా అల్లుళ్లకు వడ్డించి 8 అడుగుల ఏకరీతి విస్తరాకుపై కుటుంబమంతా కలిసి భోజనం చేశారు. అల్లుళ్ళు, కూతుళ్లు, కొడుకులు , కోడళ్ళు,మనవళ్లు ఒకే ఆకుపై ఒకరికొకరు తినిపించుకుంటూ ఆప్యాయతలను పంచుకున్నారు.
రసాయనాల రంగులతో రెడీమేడ్ ప్లేట్లు వాడుతున్న ఈ కాలంలో అతిపెద్ద విస్తరాకులో వడ్డించి తమ ప్రత్యేకతను చాటారు. సంక్రాంతి అంటే అందరూ కలవడం, సరదాగా గడపడం అని చాటి చెప్పారు.
………………………………………………………