
* స్కూల్ విద్యా కమిటీ చైర్మెన్ నిరసన
* ఖర్చు చేసిన నిధులు ఇవ్వాలని ఆందోళన
ఆకేరు న్యూస్, మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేసి.. పురుగుల మందు డబ్బాతో ఓ కాంట్రాక్టర్ నిరసన వ్యక్తం చేశారు. మన బడి- మన ఊరు కార్యక్రమంలో పాఠశాల అభివృద్దికి రూ.28 లక్షల నిధులు ఖర్చు చేస్తే .. కొత్త ప్రభుత్వం వచ్చాక నిధులు ఆగిపోయాయని ఆందోళన చేపట్టారు. మంచిర్యాల (MANCHIRYALA) జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి పురుగుమందు డబ్బాతో గేటు ముందు నిరసనకు దిగారు స్కూల్ విద్యా కమిటి చైర్మెన్ గడికొప్పుల విజయ, ఆమె భర్త గడికొప్పుల తిరుపతి. గత బీఆర్ఎస్ (BRS) హయాంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా స్కూల్ డైనింగ్ హాల్ తో పాటు పాఠశాల మరమ్మత్తులు చేపట్టామని, నిర్మాణానికి 28 లక్షల నిధులు ఖర్చు చేశామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పాఠశాలను అభివృద్ది చేస్తే బిల్లులు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికారులతో మాట్లాడించి న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.
…………………………………………….