
ఆకేరున్యూస్, తిరుమల: శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ని ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. నారాయణన్కు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం కొత్త మైలురాయిని చేరుకోబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. 1979లో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో మొదటి ప్రయోగం నిర్వహించగా.. బుధవారం నిర్వహించే ప్రయోగం వందోదని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ అంతరిక్షంలోకి పంపడం ద్వారా నావిగేషన్ను సులభంగా వినియోగించుకునే అవకాశం లభిస్తుందని నారాయణన్ చెప్పారు. ఇప్పటివరకూ 433 విదేశీ ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి ప్రయోగించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రూ.4 వేల కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ఫ్యాడ్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గగన్యాన్ ప్రయోగానికి ఈ లాంచ్ ఫ్యాడే ఉపయోగించనున్నట్లు నారాయణన్ తెలిపారు.
……………………………………