
జిట్టా బాల కృష్ణారెడ్డి అంతిమ యాత్ర , హాజరయిన ప్రజలు
* రాష్ట్ర సాధన ఉద్యమాలే ఊపిరి..
* తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు
* ఓటమికి వెరవని నైజం
* సామాజిక, రాజకీయ రంగంలో తనదైన పాత్ర
* పార్టీలకు అతీతంగా జిట్టాకు నివాళులు
ఆకేరు న్యూస్ ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ ఉద్యమమే ఊపిరి.. ఓటమికి తలవంచని నైజం.. పార్టీ ఏదైనా తెలంగాణ నినాదమే ఆయన విదానం. తెలంగాణ సాంస్కృతిక అస్థిత్వం కోసం తన దైన ప్రత్యేక పోరాటం. తెలంగాణ జాతర, తెలంగాణ సంబురాలు ఆటలు, పాటలు, వంటలు ఏవైనా తెలంగాణ అస్థిత్వ పతాక ను ఎగుర వేయడమే లక్ష్యం. వ్యక్తిగా ప్రస్థానం మొదలు పెట్టి వ్యవస్థగా ఎదిగాడు. తెలంగాణ జన జాతరై నిలిచాడు.జిట్టా బాలకృష్ణారెడ్డి.. యాదాద్రి – భువనగిరి జిల్లా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం పొందిన ఉద్యమ నేత. రాజకీయాల పేరుతో కోట్లాది రూపాయలు సంపాదించే నేతలు ఎందరో ఉన్నారు. అందుకు భిన్నంగా తెలంగాణ ఉద్యమం కోసం సొంత ఆస్తులను అమ్మి కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి రాజకీయ ప్రస్థానం పై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
* వివేకానందుడే జిట్టాకు స్ఫూర్తి
యాదాద్రి – భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా రాధమ్మ, బాలరెడ్డి దంపతుల కుమారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి. చిన్నప్పటి నుంచే అన్ని విషయాల్లోరూ చురుగ్గా ఉండేవాడు. ప్రజాసేవ చేయాలనే తపన ఉండేది. వివేకానంద స్ఫూర్తితో యువతలో ఉత్సాహాన్ని నింపేవారు. 1992లో 19 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని కొత్తపేటలోని హుడా కాంప్లెక్స్లో యువకుల సంక్షేమం కోసం వివేకానంద యువజన సంఘాన్ని స్థాపించారు. సామాజిక కార్యకర్తగా, అతను అనేక సంక్షేమ, అభివృద్ధి మరియు సమాజం యొక్క అభివృద్ధి కోసం అవగాహన కార్యక్రమాలలో పాల్గొన్నాడు. 1997లో రంగారెడ్డి జిల్లా యువజన సంఘం సమితికి స్థాపించి, బలోపేతం చేయడంలో వి జయం సాధించారు. కొత్తపేటలోని దేవాలయం, హుడా కాంప్లెక్స్కు వ్యవస్థాపక సభ్యుడు, చైర్మన్ గా కూడా వ్యవహరించారు. బాలకృష్ణారెడ్డికి 1998లో రంగారెడ్డి జిల్లా స్థాయి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ యువజన పురస్కారం లభించింది. ఇదే క్రమంలో తన సేవలను కొనసాగిస్తుండగా, 2005లో, బాలకృష్ణ రెడ్డికి భారత ప్రభుత్వం నుండి జాతీయ ఉత్తమ యువజన సేవా పురస్కారం లభించింది. 2002లో, యువజన సంఘం ఉత్తర అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
* తెలంగాణ జన జాతర
యువజన సంఘాల్లో చురుకైన పాత్ర వహించిన కృష్ణారెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ముఖ్యభూమిక పోషించారు. యువతలో తనకున్న గుర్తింపుతో అనేక మంది ఉద్యమానికి కార్మోనుకుల్ని చేశారు. ఇదే క్రమంలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ ఎస్(ప్రస్తుత బీఆర్ ఎస్)లో 2003లో చేరారు. 2004లో భువనగిరి అసెంబ్లీ టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినా టికెట్ దక్కలేదు. దివంగత సీనియర్ ఆలె నరేంద్ర పోటీ చేయడంతో జిట్టా తన టికెట్ ను త్యాగం చేశారు. 2007లో టీఆర్ ఎ స్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీలో మరింత గుర్తింపు పొంందారు. 2009లో భువనగిరి టికెట్ జిట్టాకు ఖరారయినట్లు ప్రచారం జరిగింది. భువనగిరి కాలేజీ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ కూడా ఆ విషయాన్ని ప్రకటించారు. అయితే, పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీకి కెటాయించడంతో జిట్టా తీవ్ర నిరాశకు గురయ్యారు. టీఆర్ ఎస్కు రాజీనామా చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. తన సత్తా చాటుకున్నారు. 2009 తర్వాత జిట్టా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణను ప్రకటించడంతో జిట్టా సంబరపడ్డారు. ఆ వెంటనే డిసెంబర్ 23న తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకోవడం తో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తెలంగాణ రణభేరి పేరుతో తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో భారీ బహిరంగ సభలు, సదస్సులు నిర్వహించి, ఉద్యమ స్ఫూర్తిని చాటేందుకు ఢిల్లీలో తెలంగాణ జాతర నిర్వహించారు. మిలియన్ మార్చ్, రైల్ రోకో, రాస్తారోకో, వంటా వార్పు వంటి అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. యువత, విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మేధావులు, ప్రజా సంఘాలు, మానసిక నిపుణులు, సైకాలజిస్టులతో గ్రామాల్లో బాలకృష్ణారెడ్డి అవగాహన సదస్సులు నిర్వహించారు. 2012 మహబూబ్నగర్ ఉపఎన్నికల్లో యువ తెలంగాణ బీజేపీకి మద్దతు ప్రకటించి అండగా నిలిచింది.దీంతో బీజేపీ విజయంలో బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు
* పోరాటాలే శ్వాసగా..
రాష్ట్ర ఆకాంక్ష కోసం పోరు బాట పట్టాడు . 2010లో వ్యవస్థాపక కన్వీనర్ గా యువ తెలంగాణ పేరుతో జేఏసీ ఏర్పాటు చేశారు. దాన్ని యువ తెలంగాణ పార్టీగా మార్చి స్వరాష్ట్రంలో మరో రాజకీయ పార్టీని స్థాపించి సంచలనం సృష్టించారు. 2012లో జరిగిన మహబూబ్నగర్ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థి గెలుపులో కీలకపాత్ర పోషించారు. 2014లో యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో బీజేపీ మద్దతుతో నిలబడినా గెలుపు దక్కలేదు. మూడు సార్లు ఓటమి చెందినా ఆయన ఏనాడూ కుంగిపోలేదు. ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే శ్వాసగా ప్రజల కోసం పనిచేశారు. 2022 ఫిబ్రవరిలో యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 2 జూన్ 2022న భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఉద్యమ ఆకాంక్షల సాధన సభకు కన్వీనర్గా నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిమ్స్ సమగ్ర వైద్యం అందించలేకపోయింది. సమగ్ర వైద్యం కోసం చేపట్టిన నిమ్స్ ఉద్యమంలో భాగంగా మూడు రోజుల జైలు జీవితం కూడా అనుభవించి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఏర్పాటు కోసం పోరాడారు. అయితే, రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుని మార్పు జరిగాక జిట్టా పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నెల రోజులు కూడా గడువక ముందే గతేడాది అక్టోబర్ 20న సొంతగూటి ( బీఆర్ ఎస్ ) కి చేరుకున్నారు.
* విద్య కోసం చేయూత
పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో బాలకృష్ణ రెడ్డి ముందుకు సాగారు. బాలకృష్ణ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించకముందే విద్యా సేవలను స్థాపించారు. 2003లో తన మామ ప్రవాస భారతీయుడు (ఎన్ఆర్ఐ) డాక్టర్ చిలుముల రాంచంద్రారెడ్డి అండతో భువనగిరి పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా తన అమ్మమ్మ పేరు మీద చిలుముల శివరజినీ నారాయణ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్థాపించారు. ఐదు సంవత్సరాలు, అతను ఈ కళాశాలలో పేద విద్యార్థులకు మధ్యాహ్న సమయంలో ఆకలితో ఉండకుండా మధ్యాహ్న భోజనం అందించారు.
* మూసీ కలుషితంపై..
మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న భువనగిరి నియోజకవర్గంలో కలుషిత మూసీ నీటితో పంటలు సాగుచేసి ప్రమాదకరంగా మారాయి. 2008లో బాలకృష్ణారెడ్డి భువనగిరి నియోజకవర్గంలో 350 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ప్రాంతానికి కృష్ణాజలాలు అందించాలని కోరారు. బునాదిగాని కెనాల్, పిల్లాయిపల్లి కెనాల్, బొల్లేపల్లి కెనాల్ పూర్తి చేయాలని బాలకృష్ణారెడ్డి ఉద్యమాన్ని ముందుకు తెచ్చారు. అధికారులను సమీకరించిన ధర్నాలు, రాస్తారోకో, దీక్షల పర్యవసానంగా ఆయన ఈ ప్రాజెక్టులను ప్రారంభించేలా ప్రభుత్వాన్ని కదిలించారు.
* జిట్టా జీవిత క్రమంలో కొన్ని ముఖ్య ఘట్టాలు
* యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహించడమే కాకుండా, బాలకృష్ణారెడ్డి 18 సార్లు రక్తదానం చేశారు.
* మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలపై యువతకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించారు.
* అంటరానితనం, నిరక్షరాస్యత నిర్మూలన కోసం బాలకృష్ణారెడ్డి సెమినార్లు, మెడికల్ హెల్త్ క్లినిక్లు, వేసవి శిక్షణా కోర్సులు నిర్వహించారు.
* గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు బాలకృష్ణారెడ్డి యువజన సంఘాల ద్వారా క్రీడా పోటీలు నిర్వహించారు.
* బాలకృష్ణారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, సంస్థలకు వెయ్యికి పైగా క్రికెట్ కిట్లు, వాలీబాల్స్, క్యారమ్ బోర్డులు, చెస్ ఉపకరణాలను పంపిణీ చేశారు.
* కన్వీనర్గా గుమ్మి విజయ్ కాంత్ రెడ్డి, కో-కన్వీనర్గా మహేష్ ఆదిత్య యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో (యుఎస్ఎ) యువజన సంఘాన్ని స్థాపించి, బాలకృష్ణ రెడ్డి దాని ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
* రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధి సంస్థల నుండి ఉత్పత్తులు, విరాళాలు సేకరించడం ద్వారా భూకంపం మరియు తుఫాను బాధితులకు సహాయం చేశారు.
* కోవిడ్ మహమ్మారి సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు సేవలను అందించడంలో ముందున్నారు. సత్వరం వైద్య సహాయం అందేలా కృషి చేశారు.
* లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని అణగారిన వర్గాలకు ఆయన ఇంటింటికీ ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
* మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన లేదా బతకలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించారు.
* కోవిడ్ మహమ్మారి సమయంలో బాలకృష్ణ రెడ్డి చేసిన కృషిని ఆయన నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటారు.. తెలంగాణ రాష్ట్రానికి ముందు, స్వరాష్ట్రంలోనూ రాజకీయపరంగాను, సామాజిక పరంగాను జిట్టా చేసిన పనులతో ఆయన ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
