
* తండ్రి బాటలోనే నడుస్తున్న కేటీఆర్
* దీపావళికి పూజలు చేయాలి… దావత్లు చేస్తారా
* మూసీ పునరుద్దరణకు వ్యతిరేకం కాదు
* కేంద్రమంత్రి బండి సంజయ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబంలో అంతా బూతులే మాట్లాడుతారని, కెసిఆర్ బాటలో ఇప్పుడు కెటిఆర్ నడుస్తున్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వారిది బూతుపురాణం కుటుంబమని.. ఉదయం లేస్తే చాలు ఆ పార్టీ నేతలు అందరూ బూతులే మాట్లాడుతారని బండి సంజయ్ అన్నారు. వాళ్లు చేస్తే సంసారం మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడతారని మండిపడ్డారు. కేసీఆర్ తిట్టినట్లు బూతులు ఎవరు తిట్టలేదని.. తండ్రి లాగే కొడుకు కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఆ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. బూతులు తిట్టేవాడు నోటీసిస్తే దానికి విలువ ఉంటుందా. నేనెప్పుడూ తిట్టలేదు.. కేవలం విమర్శ మాత్రమే చేశాను. కేటీఆర్ పంపిన నోటీసుకు నేను సమాధానం కూడా ఇచ్చాను.. అంతేకాదు నోటీసుకు నోటీసు కూడా ఇచ్చానని తెలిపారు. అలాగే జన్వాడ ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా కేంద్రమంత్రి విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్లో దావతులు పెట్టడానికి సిగ్గుండాలని అన్నారు. దసరాకి దావతులు చేసుకుంటారు… దీపావళికి ఎవరైనా దావతులు చేసుకుంటారా. దీపావళికి దావతులు కాదు.. లక్ష్మీ పూజలు చేసుకోవాలంటూ హితవు పలికారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామన్నారు. పోలీసులు దాడి చేసినప్పుడు రాజ్ పాకాల పోలీసులు పక్కనే ఉన్నారని.. తర్వాత మాయమైపోయాడన్నారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ కొడుకు కుటుంబ సభ్యులను తప్పించింది ఎవరని ప్రశ్నించారు. చివరికి కొండను తవ్వి ఎలుకను కూడా రేవంత్ సర్కార్ పట్టలేకపోయిందంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆర్ కే హెచ్ సర్కార్ నడుస్తోందని అంటే…రేవంత్, కేటీఆర్, హరీష్ రావు అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో బావా బామ్మర్దుల పంచాయతీ నడుస్తోందన్నారు. కేసీఆర్ కొడుకుకి ట్విట్టర్ టిల్లు అని పేరు పెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే అని అన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కొడుకు ఇద్దరూ ఒకటే అని.. తనకు భయపడి కేసీఆర్ కొడుకు నోటీసు ఇచ్చారన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏమైనా అయితే కేసీఆర్ మాట్లాడరని.. జైలుకు వెళ్లినా స్పందించరన్నారు. కానీ కేసీఆర్ కొడుకు బావమరిదికి ఏమైనా అయితే మాత్రం.. డీజీపీతో మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనే పార్టీ కేవలం బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. అలాగే రేవంత్ సర్కార్పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మెడలు వంచుతామన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని.. మూసీ పేరుతో పేదలు ఉసురు పోసుకుంటే ఊరుకోమని హెచ్చరించారు.
…………………………………………………………..