* 180కి పైగా స్థానాల్లో ముందంజ
ఆకేరు న్యూస్, డెస్క్ : బీహార్లో ఎన్డీయే హావా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జోరు కనబడుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. ఎన్డీయే కూటమి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ను దాటి ఏకంగా 180 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాగఠ్బంధన్ కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మూడు స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 6వ తేదీన తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 101 స్థానాల్లో, బీజేపీ 101 స్థానాల్లో, లోక్ జన్శక్తి (రాంవిలాస్) 28 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మెజార్టీ మార్క్ 122 స్థానాలు. గత ఎన్నికలతో పోల్చితే ఎన్డీయే కూటమి తన సీట్లను భారీగా పెంచుకున్నది. 2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 125 సీట్లు దక్కాయి. దీంతో బీహార్ ప్రజలు మరోసారి బీజేపీ కూటమికి భారీ విజయాన్ని అందించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోమారు ఎన్డీఏ కూటమి సీఎం పీఠాన్ని దక్కించుకోనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఊహించినట్లుగానే..
బీహార్లో ఈ స్థాయి విజయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందుగానే ఊహించారు. ఎన్డీటీవీ బీహార్ పవర్ ప్లే సమ్మిట్లో అమిత్ షా.. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే సాధించబోయే సీట్ల గురించి ముందుగానే చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 160కి పైగా సీట్లు గెలుచుకుంటుందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. గత వారం కూడా అమిత్ షా ఇదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బీహార్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది.
……………………………………………….
