
* తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్
* ఫుల్ కు, బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్
* ఆ కుటుంబంలో నలుగురికి నౌకరీ ఊడింది కానీ.. తెలంగాణ ఏమీ కోల్పోలేదు
* ఆయన డ్రామారావా.. రామారావా..
* కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
* ప్రతిపక్ష నాయకుడంటే రాహుల్ ను చూసి నేర్చుకోవాలని సూచన
* తెలంగాణలో ఉండే అర్హత లేదంటూ కిషన్రెడ్డిపైనా ఆగ్రహం
* వరంగల్ లో 5, 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆకేరు న్యూస్, వరంగల్ : దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, తెలంగాణ సమస్యలు, మీరు చేసిన తప్పులపై చర్చిద్దామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ లో నిర్వహించిన పలు కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డిజిటల్ విధానంలో వరంగల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి విజయోత్సవాల పేరుతో ఏర్పాటు చేసిన స్వయం సహాయక గ్రూపుల స్టాళ్లను రేవంత్ సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల సభకు హాజరయ్యారు. వేదికపై ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ చిత్రపటానికి పీసీసీ చీఫ్ మహేందర్ కుమార్ గౌడ్, మంత్రులు భట్టి విక్రమార్క, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే రాజిరెడ్డి తదితరులతో కలిసి తొలుత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జై ఇందిరమ్మ అంటూ ఉపన్యాసం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకుని వరంగల్ పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా దీవించారన్నారు.
ఇది ఆడబిడ్డల రాజ్యం
గత ప్రభుత్వంలో కొన్నేళ్లపాటు ఒక్క మహిళా మంత్రి కూడా లేరన్నారు. తమ ప్రభుత్వంలో ఇక్కడి నుంచే ఇద్దరు మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్య అయిన ఒక ఆడబిడ్డ ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ చీప్ సెక్రటరీగా ఆడబిడ్డే ఉందన్నారు. కార్పొరేషన్ మేయర్గా ఆడబిడ్డే ఉందన్నారు. ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు. కాళోజీని గుర్తించని ప్రపంచమే లేదన్నారు. అటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని ఆనాటి ప్రభుత్వం పదేళ్లయినా పూర్తి చేయకపోతే, తన బాధ్యతగా దానిపై దృష్టి సారించి వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాన్నారు.
ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్
హైదరాబాద్ నగరాన్ని వరంగల్ కు దీటుగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నామన్నారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ ను అనుమతించాలని, ఎయిర్ పోర్ట్ పనులు చూడాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తికి చర్యలు చేపట్టాలని ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెబితే, ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. దాదాపు 6 వేల కోట్ల రూపాయలను వరంగల్ నగరానికి ప్రభుత్వం మంజూరు చేసిందంటే కడియం శ్రీహరి లాంటి అందరి కృషి వల్లే అన్నారు. మొత్తం ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ అభివృద్ది చెందుతుందన్నారు. ఈ పనులను పూర్తి చేసే వరకూ తమ అధికారులను, మంత్రులను నిద్రపోనియనని మాట ఇస్తున్నా అన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్కిస్తారు..
ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎన్నో ఎయిర్ పోర్టులుంటే తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్ పోర్టు హైదరాబాద్ లో ఉందన్నారు. మనం కూడా నాలుగు ఎయిర్ పోర్టులను కట్టుకుని, కంపెనీలను తెచ్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎవరైనా అడ్డుకుంటే ఊచలు లెకించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పది నెలల్లో ఆడబిడ్డలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. అంబానీ, ఆదానీలకే పరిమితమైన సోలార్ లాంటి ప్రాజెక్టును ఆడబిడ్డలకు అందించి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆడబిడ్డల కష్టాలను చూసి 500లకే గ్యాస్ ఇస్తున్నామన్నారు.
10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు
తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. ఫుల్, ఆఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆయన అన్నారు. ఊరి ఊరికి బెల్ట్ షాపులు తెచ్చి అందరినీ మందులో ఉంచి ఆడుకుందామనుకున్నాడని, ప్రజలు ఆ విషయాన్ని గుర్తించి ఆయన ఇంట్లో నలుగురు పదవులు ఊడగొట్టారన్నారు. అంతే తప్ప తెలంగాణ ఏమీ కోల్పోలేదన్నారు. 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు. 20 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత తమ మంత్రివర్గానిదే అన్నారు. సమ్మక్క, సారక్క, భద్రకాళి సాక్షిగా మాట ఇచ్చి, రుణమాఫీ చేశానన్నారు. అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు.
నెల ఆదాయం 18,500కోట్లు
రాష్ట్రంలో ప్రతి నెలా వచ్చే ఆదాయం 18,500 కోట్లు అని రేవంత్ వివరించారు. అందులో 6500 కోట్లు జీతభత్యాలకు, కేసీఆర్ చేసిన అప్పుల మిత్తికి 6500 కోట్లు పోతున్నాయని వివరించారు. మిగిలిన 5,500 కోట్ల రూపాయలతోనే కడుపు కట్టుకుని, అవినీతిని అడ్డుకుని రూపాయి రూపాయి కూడగట్టి 18 వేల కోట్ల రుణమాఫీ చేస్తే, అభినందించాల్సింది పోయి పుల్లలు పెడుతున్నారన్నారు. కేసీఆర్ చెప్పిన సమయానికి అసెంబ్లీ పెడతానని, చర్చిద్దాం రా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. బాధ్యత గల ప్రతిపక్షనాయుడు అంటే రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలన్నారు
ప్రజలు కష్టాల్లో ఉంటే గాడిదల పండ్లు తోముతున్నవా..
నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే ఫామ్ హౌస్లో ఉండి గాదిదల పండ్లు తోముతున్నావా అని రేవంత్ రెడ్డి .. కేసీఆర్ ను ఎద్దేవా చేశారు. నువ్వు రాకుండా చిల్లర గాళ్లను ఊరికి మీదకు వదిలితే.. వాళ్లు ఏది పడితే అది మాట్లాడున్నారని అన్నారు. వాళ్ల వెనుకే కిషన్రెడ్డి వస్తాడన్నారు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడితే, కిషన్ రెడ్డి తర్వాత రోజు మాట్లాడతాడని విమర్శించారు. ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుదాం అంటే.. తాను అడ్డుపడతా అంటాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన మోదీకి ఒత్తాసు పలుకుతున్న కిషన్రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. తనకు కిషన్రెడ్డిపై ఉన్న గౌరవం పోయిందన్నారు. తట్టబుట్ట సర్దుకుని గుజరాత్కు పోయి మోదీకి గులాంగిరీ చేసుకోవాలన్నారు. 60 ఏళ్ల కలను నెరవేర్చిన సోనియమ్మకు ఎంత చేసినా తక్కువే అన్నారు. ఆ తల్లే లేకపోతే, ఈ తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. నీకు ఉద్యోగం ఇచ్చిన సికింద్రాబాద్ ప్రజలను, ఆ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడాలని కిషన్ రెడ్డికి సూచించారు. ఆయన డ్రామారావా,, రామారావా అని కేటీఆర్పై కూడా రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుర్చీలోకి కేసీఆర్ను తొక్కుకుంటూ వచ్చానని, ఎవరో ఇస్తే రాలేదని చెప్పారు. తొలుత సీఎస్ శాంతికుమారి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం మంత్రులు మాట్లాడారు.
……………………………………………..