ఆకేరున్యూస్, కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వర క్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సరస్వతీ పుష్కరాలకు పదవరోజు శనివారం భక్తులు అధికంగా రావడంతో మహాదేవపూర్ కాళేశ్వరం రహదారిలో సుమారు తొమ్మిది కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడిరది.శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి కాళేశ్వర క్షేత్రంలోని పార్కింగ్ స్థలాలన్నీ బురదమయం కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన భూపాల్ పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే లు యుద్ధ ప్రాతిపదికన కొన్ని చర్యలు చేపట్టారు. శనివారం వేలాది వాహనాలు లక్షల మంది భక్తులు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. ప్రత్యక్షంగా ఎస్పీ కిరణ్ ఖరే కాలినడకన ఏఎస్పీలు చేతన్ నితిన్, రాహుల్ రెడ్డి, మహదేవపూర్ సిఐ రామచందర్ రావు తో కలిసి కాళేశ్వరం నుండి అన్నారం క్రాస్ వరకు సుమారు 7 కిలోమీటర్లు వర్షంలో తడుస్తూ సిబ్బందికి వాకి టాకీ ద్వారా సూచనలిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మరో రెండు రోజులు భక్తుల తాకిడి మరింతగా ఉండే అవకాశాలు ఉన్నాయని సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
……………………………………………..
