*మహా జాతర ముగిసిన మేడారానికి పోటెత్తిన భక్తజనం….
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం మహాజాతర ముగిసినప్పటికీ, వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఇంకా భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకున్నారు.భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, వనదేవతలకు ఎత్తు బెల్లం, ఒడి బియ్యం, నూతన వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.సంతానం కలగాలని కోరుకుంటూ భక్తులు జంపన్న, నాగులమ్మలకు ముడుపులు కట్టారు. సమ్మక్క, సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తుల రద్దీ కారణంగా పస్రా నుంచి మేడారం వరకు ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ, వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సరైన పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తమ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలపడంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది .భారీ సంఖ్యలో వాహనాలు తరలిరావడంతో పస్రా నుండి మేడారం వరకు ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద మోహరించినప్పటికీ, ఇతర మార్గాలపై దృష్టి సారించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
