
* మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా టూరిజం హబ్గా మారనుందని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నివాస గృహాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా ములుగు జిల్లాలో టూరిజంను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు సమీపంలోనీ బ్లాక్ బెర్రీ దీవి పర్యాటకులను ఆకర్షించేలా ఉందన్నారు. ఇప్పటికే ములుగు జిల్లాలో లక్నవరం సరస్సు, రామప్ప, బొగత జలపాతం, ఆదివాసులు జాతర మేడారం, హేమాచల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు.
ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా ములుగు జిల్లా టూరిజం హబ్ గా ఉండటం గర్వకారణమని అన్నారు. ప్లాస్టిక్ నివారణకు, పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. జిల్లాలో పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా సంకల్పంతో జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ, ఇతర శాఖల అధికారులు పని చేస్తున్నారని, వారికి అభినందనలు తెలిపారు. ములుగు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే భాధ్యత మన అందరిపైనా ఉందని మంత్రి సీతక్క అన్నారు.
…………………………………………