
* శ్రీవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా
* కుమారుడు త్వరగా కోలుకోవడంతో తలనీలాలు సమర్పణ
ఆకేరు న్యూస్, తిరుపతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన కుమారుడు త్వరగా కోలుకోవాలని పవన్ భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) తిరుమల వెంకన్న స్వామిని కోరుకున్నారు. మార్క్ శంకర్ త్వరగానే కోలుకోవడంతో మొక్కును తీర్చుకునేందుకు ఆదివారం తిరుమలకు చేరుకున్న ఆమె టీటీడీ (TTD) నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేసి వరాహస్వామిని దర్శించుకున్నారు. ఆపై పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకుని.. శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించారు. రాత్రి తిరుమల్లోనే బస చేసిన అన్నా కొణిదెల.. ఈరోజు సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కుమారుడు మార్క్ శంకర్ (Mark Sankar) పేరిట రూ.17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఆపై భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.
……………………………………………………..