
* 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతాం
* బిల్లు ఆమోదం కోసం జులై 17న రైలు రోకో
* బీసీలు ఐక్యంగా ఉంటే కాళ్ల దగ్గరికే పదవులు వస్తాయి
* కామారెడ్డి డిక్లరేషన్ పై రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
ఆకేరు న్యూస్, మెదక్ : ఈ మధ్య ఎమ్మెల్సీ కవిత బీసీల గానం పాడుతున్నారు. ఎక్కడికెళ్లినా బీసీల జపం చేస్తూ బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను విడుదల చేసిన నేపధ్యంలో ఆ డిక్లరేషన్ పై మెదక్ జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ బిసి డిక్లరేషన్ సాధించే వరకూ పోరాడుతామని అన్నారు. బీసీలకు విద్య ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపించి చేతులు దులుపుకుంటే సరిపోదని ఆమె రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు.బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనని ఆమె అన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం జులై 17న రైలు రోకో చేపడతామని కవిత ప్రకటించారు.బీసీలకు 42 శాతం అమలు అయిన తరువాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. ఎంపీ రఘునందన్ రావు ఏనాడైనా బీసీల అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించారా అని కవిత ప్రశ్నించారు. బీసీలందరూ ఐక్యంగా పోరాడితే పదవులు వాటంతట అవే బీసీల కాళ్ల వద్దకు వస్తాయని కవిత అన్నారు.
………………………………………