
* బహుబాషా కోవిదుడు..సాహితీవేత్త..బహుముఖ ప్రజ్ఞాశాలి.. రాజనీతిజ్ఞడు
స్థిత ప్రజ్ఞుడు
* భారత ఆర్థిక వ్యవస్థను కష్టాలనుంచి గట్టెక్కించిన అసమాన్యుడు
* తెలుగుతనానికి నిలువెత్తురూపం మన పివి సాబ్
* నేడు భారత రత్న పివి నర్సింహారావు జయంతి
ఆకేరు న్యూస్ డెస్క్ ః ఈ మధ్య ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశం ఈ రోజు ఇలా ఆర్థికంగా నిలదొక్కుకుంది అంటే దానికి కారణం మాజీ ప్రధాని పివి నర్సింహారావు అని గుర్తుచేసుకున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా అది కాదనలేని నిజం.. స్వపక్షం వారైనా ప్రతిపక్షం వారైనా పివి ఘనతను ఒప్పుకొని తీరాల్సిందే…పివి అంటే తెలుగు వారు చాతి ఉబ్బించి గర్వంగా చెప్పుకునే పేరు…తెలుగు తనానికి నిలువెత్తు విగ్రహం మన పివి.. పివి తెలుగువాడుగా పుట్టడం తెలుగువారికి గర్వకారణం..అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానాన్ని అందుకున్న ఘనుడు మన పీవి.వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన 28న రుక్మాబాయమ్మ-సీతారామారావు అనే పుణ్య దంపతులకు పివి నరసింహారావు జన్మించారు. ఉస్మానియ యూనివర్సిటీ నుంచి బిఎ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. నాగ్పూర్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం, అలహాబాద్లో సాహిత్య రత్నను అభ్యసించారు.1957లో మంథని నుంచి ఎంఎల్ఎగా గెలిచి రాజకీయ జీవితం ప్రారంభించారు. 1972లో ఉమ్మడి ఏపికి సిఎంగా పివి సేవలందిండంచారు.భూ సంస్కరణలు అమలు చేయడంతో భూ స్వాములు పెట్టుబడి వర్గం వారు అందరూ పివికి వ్యతిరేకం అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇమడ లేక తన మకాంను ఢిల్లీకి మార్చారు. పివిలో ఉన్న గొప్పతనాన్ని పివి ప్రతిభను గుర్తించిన ఇందిరాగాంధి పివికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు.. ఇందిరా, రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. ఇక రాజకీయాలు వద్దనుకొని తనకు ఇష్టమైన సాహితీ ప్రపంచంలో శేష జీవితం గడుపుదామనుకొని పెట్టె బేడా సర్దుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పయనమైన పివి జీవితం లో ఊహించని మలుపు తిరిగింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెంబదూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధి ఎల్టీటీఇ ఉగ్రవాదుల చేతిలో మానవబాంబుకు బలిఅయ్యారు.. ఈ నేపధ్యంలో పివిని వెనక్కి రమ్మని ఢిల్లీ నుంచి పిలుపు. కాంగ్రెస్ పార్టీకి పివి సేవలు అవసరం అని ఆ పార్టీ గుర్తించింది. వెంటనే ఢిల్లీకి పయనమైన పివి ఎన్నికల ఫలితాల తరువాత ప్రధాని పదవి చేపట్టవలసి వచ్చింది.. ఇది పివి జీవితంలో మలుపు అయితే భారతదేశానికి కూడా ఓ మలుపే అని చెప్పవచ్చు. పివి పుణ్యమా అని భారతదేశం కష్టాలనుంచి గట్టెక్కింది. అప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థతో భారతదేశం అల్లాడిపోతోంది.పీవీకి పూర్వపు ప్రధానులైన వీపీ సింగ్, చంద్రశేఖర్ పాలనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చైనా (1962), పాకిస్థాన్ (1971)తో యుద్ధాలతో ప్రారంభమైన ఎకానమీ పతనం పీవీ అధికారంలోకి వచ్చేనాటికి పీక్ దశకు చేరుకుంది. దేశంలోని బంగారం నిల్వలను విదేశీ బ్యాంకుల్లో కుదువ పెట్టి తెచ్చిన డబ్బుతో దేశాన్ని నడిపిస్తున్న పరిస్థితి. ప్రపంచ దేశాలతో పోలిస్తే పూర్తిగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ.. పెద్ద పెద్ద ఆర్థిక వేత్తలూ ఏం చేయాలో తోచక తలపట్టుకుంటున్న వేళ.. అప్పుడు పివి భారత దేశ భవితవ్వాన్ని భుజాన వేసుకొని సరళీకృత ఆర్థిక విధానాలతో చరిత్ర గతిని మార్చాడు.. మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థిక వేత్త మన్ మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించుకొని ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడమే కాదు ఈ రోజు ఆర్థికంగా ఇంత బలమైన దేశంగా నిలదొక్కుకోవడానికి మూల కారకుడు పివి.సరళీకృత ఆర్థిక విధానం ద్వారా ఎఫ్డిఐలకు నాంది పలకడంతో పాటు ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే అనేక సంస్కరణలకు పివి శ్రీకారం చుట్టారు. 1992లో ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్డిఐలకు అనుమతించారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా వాజ్పేయీని పంపిన ఘనత పివికి దక్కుతుంది. తన జీవితకాలం మొత్తం దేశ సేవలో గడిపిన పివి 2004లో కన్నుమూశారు.
………………………………………………