
హైదరాబాద్లో 141 డేంజర్ పాయింట్లు...
* హైదరాబాద్లో 141 డేంజర్ పాయింట్లు
* భారీగా వరద నీరు నిలిచే ప్రాంతాలు
* చినుకు పడితే రోడ్లపైనే వాహనదారులు
* ప్రయాణానికి రెండు, మూడు రెట్ల అధిక సమయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారీ వాన కురిస్తే హైదరాబాద్లో తలెత్తే ఇబ్బందులు చాలా మందికి అనుభవమే. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభిస్తుంది. లోతట్టు ప్రాంతాలు పొంగిపొర్లుతాయి. నాలాలు ఉప్పొంగుతాయి. మిరుమిట్లు గొలుపే వెలుగుల్లో, భారీ భవంతులతో ధగధగలాడే మహానగరం.. వానొస్తే మాత్రం వణికిపోతుంది. ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఈక్రమంలోనే భారీగా వరద నీరు నిలిచే ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వాహనాల వేగం మందగించడం, ఆదమరిచి ప్రయాణిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండే అవకాశం ఉంది.
ఏళ్లుగా అవే ఇబ్బందులు
వర్షం వస్తే.. నగరంలో చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ విభాగాలు విఫలం అవుతున్నాయి. దీంతో పౌరులకు ఇబ్బందులు తప్పడం లేదు. చినుకు పడిందంటే మహానగర రహదారులపై ప్రయాణం నరకంగా మారుతోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సాధారణ రోజుల్లో పీక్ అవర్స్లోనూ 40 నిమిషాల్లో చేరే గమ్యస్థానానికి వర్షం కురిస్తే గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది.
చెప్పేదొకటి.. చేసేదొకటి..
రోడ్లపై భారీగా వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కరించామని బల్దియా అధికారులు చెబుతున్నా, వాస్తవంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లు 141. ఇందులో 135 జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లపై ఉండగా.. మరో ఆరు టీజీఐఐసీ, ఆర్ అండ్ బీ, కంటోన్మెంట్ పరిధిలోని రోడ్లపై ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా వరద నీరు నిలిచే ప్రాంతాల సంఖ్య అంత కంటే ఎక్కువే ఉంటుంది. ఇక చిన్నా చితక వరద నీరు నిలిచే ప్రాంతాలు మరో 150 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
వాన కష్టాలు తీరవా..?
రహదారులపై వరద నీటి ముంపునకు శాశ్వత పరిష్కారం చూపడంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా విఫలమవుతోంది. దీంతో మహానగర వాసులకు వాన నీటి కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఆస్తుల సేకరణ, అందుబాటులో నాలాలు, చెరువులు లేకపోవడంతో వరద నీరు సాఫీగా వెళ్లేలా చేసే అవకాశం లేకుండా పోతుందని ఓ అధికారి పేర్కొన్నారు. మాన్సూన్లో రోడ్లపై నిలుస్తోన్న వరద నీటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు, మోటార్లు, ఇతర పరికరాలు, కార్మికులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్లలోనే అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
ఈ ప్రాంతాల్లో భారీ నీళ్లు
వర్షం కురిస్తే భారీగా వరద నీరు నిలిచే కొన్ని ప్రాంతాలను అధికారులు గుర్తించారు. అవేమిటంటే.. ఇసీఐఎల్ ఎక్స్ రోడ్, ఉప్పల్ స్టేడియం పిల్లర్ నంబర్-916, 811, చిలుకానగర్ టీ జంక్షన్, సాగర్ రింగ్ రోడ్డు, రెయిన్ బో ఆస్పత్రి ఎల్బీనగర్ , చంపాపేట డీ మార్ట్ నుంచి జేఎస్ రెడ్డి స్విమ్మింగ్ పూల్, ఆర్యూబీ మలక్పేట, అక్షయ హోటల్, మలక్పేట గంజ్, చంచల్గూడ వై జంక్షన్, డబీర్పురా దర్వాజ, పీవీఎన్ఆర్ పిల్లర్ నెంబర్- 192, పీవీఎన్ఆర్ పిల్లర్ నంబర్ – 264, టోలిచౌకి వంతెన కింద, నాంపల్లి మెట్రో స్టేషన్ కింద, రంగమహల్ వై జంక్షన్, బషీర్బాగ్ నుంచి కింగ్ కోఠి రోడ్డు , రోడ్ నెంబర్ – 44 జూబ్లీహిల్స్, హెచ్పీ పెట్రో పంప్, తాజ్ కృష్ణా బస్టాప్, నెక్టార్ గార్డెన్ కావూరి హిల్స్, ఎన్నికల కమిషనర్ కార్యాలయం ముందు గచ్చిబౌలి, బయో డైవర్సిటీ జంక్షన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద, తారానగర్, లింగంపల్లి కూరగాయల మార్కెట్, మూసాపేట మెట్రో స్టేషన్, జేఎన్టీయు పక్కన, రాజీవ్గాంధీ నగర్, నిజాంపేట ఎక్స్ రోడ్, నర్సాపూర్ ఎక్స్రోడ్ ఇండియన్ బ్యాంక్ ఉషాముళ్లపూడి తదితర ప్రాంతాల్లో భారీ గా నిళ్లునిలిచిపోతున్నాయి.