TPCC vice president Jhansi Reddy on Voter Registration
* అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యం – ఝాన్సీ రెడ్డి
ఆకేరు న్యూస్, రాయపర్తి : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టిపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు.
మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో టిపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథిగా. పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంపై ఆమె మాట్లాడారు.
* ఓటు హక్కు ప్రజాస్వామ్య ఆయుధం..
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఝాన్సీ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో మార్పు తేవడానికి ఓటు హక్కు ఒక శక్తివంతమైన ఆయుధమని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించాలని సూచించారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు (ఫారం-6), తప్పుల సవరణ (ఫారం-8), మరియు మరణించిన లేదా ఊరు విడిచి వెళ్లిన వారి పేర్ల తొలగింపు (ఫారం-7) ప్రక్రియలను బాధ్యతగా పూర్తి చేయాలని కోరారు.
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, ఎలాంటి బోగస్ ఓట్లకు తావులేకుండా ఒక స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి అధికారులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
మండల కేంద్రంలో మరియు అన్ని గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హత ఉండి ఓటు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఝాన్సీ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
