TGNPDCL Digital Dashboard System
* సమగ్ర డిజిటల్ డ్యాష్బోర్డ్ వ్యవస్థ అమలు
* ప్రతి విభాగం పై రియల్ టైమ్ పర్యవేక్షణ
– సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
ఆకేరు న్యూస్, హనుమకొండ:
విద్యుత్ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని అన్ని విభాగాల పనితీరును ఒకే వేదికపై పర్యవేక్షించేలా అత్యాధునిక డిజిటల్ డ్యాష్బోర్డ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది.
* రియల్ టైమ్లో పర్యవేక్షణ
ఈ డిజిటల్ డ్యాష్బోర్డ్ ద్వారా సంస్థ పరిధిలోని సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్ల రోజువారీ కార్యకలాపాలను రియల్ టైమ్లో పరిశీలించే అవకాశం ఉంటుంది. దీనివల్ల డేటా ఆధారంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు.
* ఏయే విభాగాలు ఇందులో ఉంటాయి?
ఆపరేషన్స్, ఫైనాన్స్, మానవ వనరులు (HR), ప్రాజెక్ట్స్, ఎంఆర్టీ, పర్చేజ్ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్, కన్స్యూమర్ కేర్ సెంటర్ తదితర విభాగాల పనితీరును ఈ డ్యాష్బోర్డ్ ద్వారా ఒకేచోట పర్యవేక్షించవచ్చు.
* వినియోగదారులకు ఎలా ఉపయోగం?
1912 కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులు, సర్కిళ్ల వారీగా పెండింగ్ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు, విద్యుత్ అంతరాయాల వివరాలు వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో సమస్యల పరిష్కారం మరింత వేగవంతం కానుంది.
* ముందస్తు హెచ్చరికలు కూడా..
విద్యుత్ పరికరాల నిల్వలు తగ్గిపోతే ఒకటి నుంచి మూడు నెలల ముందే అలర్ట్ వచ్చేలా వ్యవస్థను రూపొందించారు. అలాగే కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, నిధుల వినియోగం, కాంట్రాక్టర్ల పనితీరును కూడా మైలురాళ్ల వారీగా ట్రాక్ చేయనున్నారు.
* దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ పంపిణీ సంస్థగా..
సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి క్షేత్రస్థాయి పనితీరును మెరుగుపరచడం, వనరులను సమర్థంగా ఉపయోగించడం, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే ఈ డిజిటల్ డ్యాష్బోర్డ్ లక్ష్యమని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ పంపిణీ సంస్థగా టీజీఎన్పీడీసీఎల్ను తీర్చిదిద్దడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
