
* అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ
* నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్న ప్రభుత్వం
* ప్రతిపాధిత ఫోర్త్ సిటీ ప్రాంతంలో పెట్టుబడులు..
* ఆసక్తి చూపుతున్న రియల్టర్లు
హైదరాబాద్, ఆకేరు న్యూస్ : రియల్ రారాజు హైదరాబాద్ సిటీ. రియల్ రంగంలోదేశంలోని మెట్రో నగరాలతో హైదరాబాద్ మహా నగరం పోటీ పడింది. దీ బెస్ట్ లివబుల్ సిటీగా పేరుగాంచడంతో పాటు దేశంలోని ముంబాయి, ఢిల్లీ, బెంగుళూరు, కలకత్తా, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో లివింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది.. దీంతో 2023 జూన్-జులై వరకు రియల్ ఎస్టేట్ దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో హైదరాబాద్ పోటీ పడింది. అయితే…రాష్ట్రం గత ఏడాదిగా పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. వరుసగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులోకి రావడంతో 2024 జూన్ వరకు రియల్ ఎస్టేట్ రంగం కొంత స్థభించింది. అనంతరం పరిపాలకుల నిర్ణయాలు, అనాలోచిత ప్రకటనలతో పాటు హైడ్రా వంటి ప్రయోగాలతో గత పదేండ్లుగా రియల్ రారాజుగా ఉన్న హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దివాల తీసిందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.. వరుస ఎన్నికలకు తోడు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం హైదరాబాద్ రియల్ రంగం పై పడిందన్న అభిప్రయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ సంఘాలు, బడా రియల్టర్లు ప్రభుత్వంతో చర్చలు జరిపి, ప్రాపర్టీ షోల వంటి ప్రయోగాలు చేసిన హైదరాబాద్ రియల్ రంగం మాత్రం కోలుకో లేక పోతోంది .. దీంతో రాష్ట్రంలో రియల్ పెట్టుబడులతో పాటు భూముల క్రయ విక్రయాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రియల్ రాబడి తగ్గింది. ఫ్యూచర్ సిటీ మీదనే ఆశలు : ప్రభుత్వం తాజాగా ఫ్యూచర్ సిటీ ప్రకటన చేయడంతో రియల్ రంగానికి ఊతమిచ్చినట్లైంది. దీంతో ఫ్యూచర్ సిటీపై క్రమంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఆశలు పెంచుకుంది.
ప్రతీ సభలో ఫ్యూచర్ సిటీ ప్రస్తావన…
రియల్ ఎస్టేట్ రంగానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు వేదిక ఏడైనా వారి ప్రసంగంలో ఉంటున్న ప్రధాన ప్రకటన ప్యూచర్ సిటీపై చేస్తున్నారు. వేల ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కొత్త పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వంలోని ప్రతిఒక్కరు పదేపదే చెప్తున్నారు. రాష్ట్రంలో రియల్ గ్రోత్ పై దృష్టి సారించిన ప్రభుత్వం హైదరాబాద్ రియల్టీని పట్టాలెక్కించే పనిలో భాగంగా ఫ్యూచర్ సిటీ పుట్టుకొచ్చిందని చెప్పవచ్చును. ప్రభుత్వం ప్యూచర్ సిటీ ప్రకటనతో హైదరాబాద్ రియల్టీ గ్రోత్ పై రియాల్టర్లు ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటన తర్వాత ప్రతిపాధిత ప్యూచర్ సిటీ ప్రాంతంలో భారీ రియల్ ప్రాజెక్టులు రానప్పటికి ఫ్యూచర్ సిటీ సమీప భవిష్యత్తులో రియల్ రంగానికి కొత్త ఊపిరి పోస్తుందనే విశ్వాసంను రియల్ వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలోభూములను కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటికే అన్వేషణ షురూ చేశారు. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మహేశ్వరం, ఇబ్రహింపట్నం, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో 2024 జనవరిలో భూములకు ఉన్న ధరలతో పోల్చితే 30 నుంచి 40శాతం పెరిగాయని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో పెరిగిన బ్రాండ్ వ్యాల్యూ..
సుమారు నాలుగు వందల సంవత్సరాల పైచిలుకు చరిత్రాత్మక నగరం హైదరాబాద్. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు, విదేశీయులు సైతం నివాసం ఉండే ది బెస్ట్ లీవబుల్ సిటీ హైదరాబాద్. హైదరాబాద్ లో ఉండే అహ్లాదకరమైన వాతావరణం, విద్యా, వైద్య సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు, ప్రపంచ స్థాయి మౌళిక వసతులు, సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో దేశంలోని ఇతర కాస్మోపాలిటిన్ పట్టణాలతో పోటీ పడుతూ హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతుంది. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ఉన్న హైదరాబాద్ లో సైబరాబాద్ సిటీ ఆవిష్కృతం అయ్యింది. తాజాగా ప్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో రియల్ వ్యాపారులతో పాటు పెట్టుబడిదారుల చూపు ఫ్యూచర్ సిటీపై పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ పదింతలు పెరిగింది.
అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం…
గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడంతో హైదరాబాద్ నలు దిక్కులా అభివృద్ది పరుగులు పెట్టింది. పల్లెలు పట్టణాలుగా మారాయి. దీంతో రియల్ వ్యాపారం ఔటర్ రింగు రోడ్డును దాటి ప్రతిపాధిత రీజనల్ రింగు రోడ్డు వరకు విస్తరించింది. అయితే ఫార్మాసిటీ నిర్మాణం కోసం గత ప్రభుత్వం భూ సేకరణ చేపట్టడంతో ఈ ప్రాంతంలో నివాస ప్రాంతాలకు పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. కానీ తాజాగా ఫోర్త్ సిటీని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో…
ఫ్యూచర్ సిటీని అత్యంత ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో పాటు ఆరోగ్య, క్రీడా హబ్ లకు అధిక ప్రాధాన్య ఉంటుందని, ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు మెట్రోరైల్ ను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి విదితమే. సుమారు 50 యేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విశాలమైన రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, అంతర్జాతీయ స్థాయిలో విద్యా, వైద్య సౌకర్యాల ఏర్పాటుకు పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఫ్యూచర్ సిటీ చుట్టూ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. అలాగే విద్యా, వైద్య, ఉపాధి అంశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ రీక్రియేషన్, క్రికెట్ స్టేడియం నుంచి గోల్ఫ్ కోర్స్ వంటి క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఇప్పటికే బీసీసీఐతో చర్చించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కొద్ది రోజుల కిందట ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్లు మరో నగరాన్ని నిర్మించేందుకు కొంత సమయం పట్టినా.. సామాన్య, మధ్య తరగతి వారికి సొంతిళ్లు నిర్మించుకునేందుకు, కొనుక్కునేందుకు ముందు ముందు అవకాశం దక్కుతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ప్రకటనతో రియల్టీకి భరోస పెరిగిందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భూముల ధరలకు రెక్కలు..
రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాధిత ప్యూచర్ సిటీ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం ఫోర్త్ సిటీ ప్రకటన చేయడంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. ఇప్పటికే ఔటర్ రింగురోడ్డును దాటి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించగా, ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ ప్రాంతంపై రియాల్టర్ల ఫోకస్ పెరిగింది. ప్రధానంగా మహేశ్వరం, ఇబ్రహింపట్నం, కల్వకుర్తి నియోజవకవర్గాల్లో భూములకు మంచి ధరలు పలుకుతున్నాయి. ముచ్చర్ల సమీపంలోని దాసర్తపల్లి, కడ్తాల్, నేదునూరు, కందుకూరు, మిరాన్పేట్, తుమ్మలూరు, మహూశ్వరం, గూడూరు, వంజగూడ, నాగిరెడ్డి గూడ, మక్త మండారం తిదితర ప్రాంతాల్లో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నారు.
……………………………………….