
* సామాజిక బాధ్యత చాటుతున్న పరిశ్రమ
* సీఎం పిలుపునకు స్పందన
* డ్రగ్స్, ఉమెన్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు
* సినీ హీరోల వీడియోలతో లఘు చిత్రాల రూపకల్పన
* సామాజిక అంశాలతో పాటు వ్యాపారమూ దాగుందంటున్న విశ్లేషకులు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ప్రకృతి విపత్తుల సమయంలో నేనున్నా అంటూ సినీ పరిశ్రమ ముందుకు ఎప్పుడూ వస్తుంది. సినీ నటులు, దర్శక నిర్మాతలు.. ఇలా ఎవరికి వారు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కొందరు బాధితులకు నేరుగా అండగా ఉంటే.. మరికొందరు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందించి.. తమ దాతృత్వాన్ని చాటుతుంటారు. ఇంకొందరు విపత్తులతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంటారు. ఇప్పుడు సరికొత్త పంథాలో సామాజిక బాధ్యతను చాటుతున్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై ప్రజలకు అవగాహన కలిగించేలా లఘుచిత్రాలను రూపొందిస్తున్నారు. గతంలో కూడా ఈతరహా లఘుచిత్రాలను కొందరు రూపొందించినప్పటికీ.., సమాజ హితం కోసం దాన్ని తప్పనిసరి చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఆదేశాలు జారీ చేయడంతో ప్రముఖ హీరోలు సైతం లఘుచిత్రాల్లో నటిస్తున్నారు.
గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటి నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన కొత్త వాహనాల ప్రారంభోత్సవం సందర్భంగా జూలై నెలలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. “సినిమాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నారు. సమాజానికి మీరు కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. ఒక సినిమాకు కోట్ల రూపాయలు తీసుకుంటున్నప్పుడు ప్రజల బాగు కోసం ఆ సినిమా తారలు కొన్ని అవగాహన వీడియోలు తీయాల్సిందే. సైబర్ క్రైమ్ , డ్రగ్స్పై సినిమాల్లో అవగాహన కల్పించేలా హీరోలతో వీడియోలు తీయించి.. థియేటర్లలో ఉచితంగా వీడియో ప్రదర్శించాలి. సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన కానీ రెండు లేదా మూడు నిమిషాల నిడివితో ఆ సినిమాలో ఆర్టిస్టులతో వీడియో చేసి అవగాహన కల్పించాలి. కేవలం సినిమా టికెట్ల రేట్లు పెంచాలనో.. లేదా షూటింగులకు అనుమతులు ఇవ్వాలనో సినీ ప్రముఖులు ప్రభుత్వం దగ్గరకు రావద్దు. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అలా చేస్తేనే.. టికెట్ రేట్లు పెంచుతాం” అని వెల్లడించారు.
డ్రగ్స్ కు వ్యతిరేకంగా ముందుకొచ్చిన పుష్ప
సీఎం పిలుపు మేరకు ఇప్పటికే సినిమాల ముందు సామాజిక అంశాల ఇతివృత్తంతో లఘుచిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు తాజాగా బన్నీ కూడా పాలుపంచుకున్నారు. డిసెంబర్ 5న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతోంది. ఈక్రమంలో అల్లు అర్జున్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ వీడియో చేసారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 కి కాల్ చేయండి. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం వాళ్ళని శిక్షించడం కాదు వాళ్లకు హెల్ప్ చేయడం అని అల్లు అర్జున్ అందులో నటించారు. గతంలో కెమెరా ముందు నిల్చొని ఇలాంటి విషయాలను హీరోలు మాములుగా చెప్పేవారు. ఇప్పుడు ఓ యాడ్ రూపంలో పుష్ప టీమ్ రూపొందించింది. అలాగే.., హీరోయిన్ రష్మిక కూడా ఉమెన్ సేఫ్టీ గురించి వివరిస్తూ వీడియో సందేశం తెలిపారు. ఓ యాడ్ చివరలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు, అమ్మాయిలు ఏమైనా అన్యాయం జరిగితే భయపకండి. షీ టీమ్ ను ఆశ్రయించండి.. అని మెసేజ్ ఇచ్చారు.
స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
అల్లు అర్జున్ వీడియోను వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి దానిపై స్పందించారు. “డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కలిగించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం..” అని విజ్ఞప్తి చేశారు. సే నోటు డ్రగ్స్ వంటి పలు హ్యాష్ ట్యాగ్ లను జోడించారు. సీఎం పోస్టుకు అల్లు అర్జున్ రిప్లయ్ ఇచ్చారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. డ్రగ్స్ రహిత హైదరాబాద్, తెలంగాణ కోసం మీరు చూపుతున్న చొరవకు అభినందనలు.. అని తెలిపారు. అయితే.. ఈ వీడియోల్లో సామాజిక అంశాలతో పాటు.. దాని వెనుక వ్యాపారమూ దాగుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకే వీటిలో తప్పనిసరై నటిస్తున్నారని చెబుతున్నారు.
………………………………………………….