
* గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే
ఆకేరున్యూస్, భూపాలపల్లి: గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసం చేసే మల్టిలెవెల్ వ్యాపారాలు పెరుగుతున్నాయని, వివిధ వస్తువులు, గృహోపకరణాలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీ మొదలగు వాటి పేర్లు చెప్పి ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేసే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ఎక్కువ మంది ఎజెంట్లను చేర్పించి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందండి అనే వాటిని నమ్మొద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి శ్రీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చైన్ సిస్టం మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా ఆర్థికపరమైన మోసాలు జరుగుతున్నాయని ప్రజలు గుర్తించాలని కోరారు. ఎక్కువమంది ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు లభిస్తాయని సైబర్ నేరగాళ్లు ఆశ చూపుతారని, అలాంటి వారి మాయమాటలు నమ్మి అత్యాశకు పోతె భారీగా ఆర్థిక నష్టం జరుగుతుందని ఎస్పి తెలిపారు.
కొత్త పద్ధతుల్లో మోసాలు..
సైబర్ మోసగాళ్ళు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని.. సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో, సైబర్ మోసగాళ్లు మల్టీలెవెల్ మార్కెటింగ్పై దృష్టి సారించి గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి, మోసగించి ఆర్థిక నష్టాన్ని కలగజేస్తున్నారని, మల్టీ లెవెల్ మార్కెటింగ్ను చాలామంది విదేశాల్లో ఉండి ఒక రాకెట్లా నడుపుతారని.. భారీ లాభాలతో పాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట తమ ముఠాలతో అమాయకులకు వల పన్నుతారని ఎస్పి తెలిపారు.
అత్యాశకు పోతే మోసపోవడం ఖాయం..
తక్కువకాలంలో అధికలాభాలు వస్తాయని, ఎవరైనా చెప్తే అది మోసమని గ్రహించాలని.. లేదంటే అమాయక ప్రజల డబ్బులు కొల్లగొడతారని.. అత్యాశకు పోతే మోసపోవడం ఖాయమని, గొలుసుకట్టు మార్కెటింగ్ లో ముందుగా చేరిన వారికి లాభాలు వస్తాయని, ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోతారని, ఇలాంటి నెట్వర్క్లో ఎవరు చేరొద్దని సూచించారు. ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరూ వెళ్లొద్దని.. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటనల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేయవద్దని, మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 గాని జిల్లా సైబర్ సెల్ వాట్సప్ నెంబర్ ం918712658154కు గాని, పోలీసు స్టేషన్లో గాని ఫిర్యాదు చేయాలని ఎస్పి కిరణ్ ఖరే కోరారు.
……………………………………………