
వృద్దురాలి మృతదేహాన్ని బయటికి తీసుకొస్తున్న దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు, హోమ్ గార్డ్ రవీందర్
* వరదనీటిలో పడి మరణించిన వృద్దురాలి మృతదేహాన్ని బయటికి తీసిన దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు, హోమ్ గార్డ్ రవీందర్
* జయహో పోలీస్ అంటూ కీర్తిస్తున్న ప్రజలు
ఆకేరు న్యూస్, వరంగల్: నేను ఉన్నాను.. అంటూ వరదనీటిలో పడి మరణించిన వృద్దురాలి మృతదేహాన్ని ఎస్సై వెంకటేశ్వర్లు, హోమ్ గార్డ్ కలిసి బయటకు తీశారు. వివరాలు.. బిక్షాటన చేసుకొని జీవించే మందపెల్లి గ్రామానికి చెందిన సమ్మక్క(75) ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలోని రైస్ మిల్లు వద్ద వున్న కల్వర్టు మీదుగా నడుస్తూ జారీ కల్వర్టు నీటిలో పడి మృతి చెందింది. మరుసటి రోజు గిర్నిబావి గ్రామ పరిసర పంట పొలాల్లో వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృత దేహం లభ్యం కావడంతో దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు తన హోం గార్డు రవీందర్ తో సంఘటన స్థలానికి చేరుకొన్నాడు. కానీ పంటపొలాల్లో పడిఉన్న వృద్దురాలి మృతదేహాన్ని రోడ్డు పైకి ఎవరు కూడా తీసుక రాకపోగా చోద్యం చూస్తున్నారు. దీంతో బాధ్యతెరిగిన దుగ్గొంది ఎస్సై తన హోదాను సైతం పక్కన పెట్టి స్వయంగా తనతో వచ్చిన హోంగార్డ్ తో కలిసి పంట పొలాల్లో పడిఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని రోడ్డుపై తీసుకొచ్చి పంచనామా నిర్వహించారు. వృద్దురాలి మృతదేహాన్ని బయటకి తీసుకరావడానికి రక్త సంబంధీకులు, బంధువులు సైతం ముందుకు రాకపోవడంతో ఖాకీ చొక్కా చాటున కరుకు గుండె కాదు.. కారుణ్యం దాగి ఉంటుందని నిరూపించారు.. దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు, హోంగార్డు రవీందర్. వీరిరువురు పోలీస్ అధికారులు స్పందించిన తీరుపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు జయహో పోలీస్ అంటూ కీర్తిస్తున్నారు.
——————————