Chilpur Paddy Procurement Centre Corruption Protest
* వడ్ల కొనుగోలు కేంద్రాల దోపిడీపై సీపీఎం ఆందోళన
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో పిఎసిఎస్, ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలలో జరిగిన లక్షల రూపాయల అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది.
ఈ మేరకు శనివారం చిల్పూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులతో ధర్నా నిర్వహించారు. మండలంలోని వెంకటాద్రిపేట, వెంకటేశ్వర్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది రైతులు గత రెండు రోజులుగా తహసీల్దార్ కి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. దీనిపై స్పందన లేకపోవడంతో ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా మండల కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి, పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎరువులు, పురుగు మందుల ధరలతో ఇబ్బంది పడుతూ, అప్పులు చేసి పంటలు పండిస్తున్న రైతు, వడ్లు అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఐకెపి, పిఎసిఎస్ అలాంటి రైతు ప్రభుత్వ సెంటర్లలో వడ్లు పోస్తే ఏ కష్టం చేయకుండా రైస్ మిల్లుల వారు, సెంటర్ల నిర్వాహకులు రైతుల వడ్లను దారి దోపిడీ దొంగల్లా లక్షల రూపాయలు పంచుకుంటున్నారు.
* డిమాండ్లు..
1. జిల్లా కలెక్టర్ గారు వెంటనే ప్రత్యేక విచారణ కమిటీ వేసి చిల్పూర్ మండలంలోని అన్ని పిఎసిఎస్, ఐకెపి సెంటర్ల ట్రక్ చిట్టీలు, మిల్లుల ఆన్లైన్ రసీదులు, రైతులకు ఇచ్చిన రసీదులు తనిఖీ చేయాలి.
2. C గ్రేడ్ పేరుతో జరిగిన దోపిడీకి నష్టపోయిన ప్రతి రైతుకు ఎం ఎస్ పి, వడ్డీతో పరిహారం ఇప్పించాలి.
3. బస్తాకు ₹3 దందాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను సస్పెండ్ చేయాలి.
4. డబుల్ కటింగ్, వెయిట్ మోసాలకు పాల్పడిన మిల్లు యజమానులు, సెంటర్ నిర్వాహకుల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో తోకల దివాకర్ రెడ్డి, గాదె సాంబరాజు, కేసీరెడ్డి కొండల్ రెడ్డి, బొమ్మీశెట్టి లింగయ్య, తుప్పరి నర్సింగరావు, కనకం లక్ష్మీనారాయణ, కనకం రఘు, సారకుంట కనకరాజు, తడగొని ఉపేందర్, రైతు సంఘం మండల అధ్యక్షులు గద్ద కుమార్, వార్డు సభ్యుడు ఊరడి బుచ్చిరాజ్, ఊరడి లింగయ్య, సాదం రాజు, పోలు శ్రీనివాస్, నారబోయన బిక్షపతి, ఊరడి రవి తదితరులు పాల్గొన్నారు.
