
* మాజీ మంత్రి హరీశ్రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: వృద్ధులకు పెన్షన్లు ఆపడం సరికాదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. పెన్షన్లలో కోతలు విధించడమంటే.. వారి నోటికాడి బుక్కను లాగేసుకోవడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరు గ్రామ పంచాయతీలో కొడుకు ఇంటి పన్ను కట్టలేదని తల్లి వృద్ధాప్య పెన్షన్లో కోత విధించిన ఘటనపై హరీశ్రావు స్పందించారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయమని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ప్రతి నెలా రూ.4 వేలు పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వచ్చే రూ. 2 వేల పింఛన్ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని, ఇంటిపన్ను, ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
………………………………..