
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కీలక నిర్ణయం తీసుకుంది. వడగాల్పులను విపత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వడదెబ్బతో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఇవ్వాలని భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి వడదెబ్బ బారిన పడే బాధితుల (Sun Stroke Victims) కుటుంబాలకు ఉపశమనం కల్పించే ఉద్దేశ్యంతో, పునరావాస సహాయ నిబంధనల ప్రకారం ఎక్స్-గ్రేషియా/సహాయం అందించాలని నిర్ణయించింది. తీవ్ర ఎండల మధ్య రాష్ట్రంలో ఎంతో మంది పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవుట్ డోర్ కార్మికుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. వడగాల్పులను వాతావరణ విపత్తుగా ప్రకటించి, ఆర్థికంగా ప్రభావితమైన కార్మికులకు విపత్తు భత్యం అందించనుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉపాధి, ఇతర పనుల నిమిత్తం రోడ్డుపైకి వచ్చిన వడదెబ్బ బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం నిర్ణయం కాస్త ఓదార్పుగా నిలవనుంది. ఇప్పటి వరకు ఆపద్బాందు కింద బాధిత వ్యక్తులకు రూ. 50 వేలు మాత్రమే ఎక్స్గ్రేషియా ఇచ్చారు.
………………………………………………….