
* అచ్చిరాని పాలనలో 30 సంవత్సరాలు వెనక్కుపోయాం
* ఏపీ సీఎం నారా చంద్రబాబు
ఆకేరున్యూస్, అమరావతి: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( CHANDRABABU NAIDU) మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలు మహా ఉద్యమంలా మునుపెన్నడూ చూడని చైతన్యంతో ఓట్లు వేశారన్నారు. 13.5శాతం గ్రోత్ గతంలో సాధించామని తెలిపారు. ‘‘2019లో ఒక్కఛాన్స్ అనేమాట చెప్పి అధికారంలోకి వచ్చారు.. నాకు నాలుగు అయిదు నెలలు పట్టింది. జరిగింది చూస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ విధ్వంసం జరిగిందని తెలిపారు. జీవోలు పెట్టలేదని, సీఏజీకి కూడా లెక్కలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో విభజన కన్నా ఈ అయిదు సంవత్సరాలు ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. అసమర్ధ పాలన, అభివృద్ది నిరోధక నిర్ణయాలు, ప్రజాసంపద దోపిడీ, పన్నుల బాదుడు, స్కాములు కోసమే స్కీములు తెచ్చారని విమర్శించారు. అమరావతి నిర్మాణం ఆపారని.. బ్రాండ్ను దెబ్బతీశారన్నారు. పోలవరాన్ని పూర్తిచేసి నదులు అనుసంధానం చేయాలంటే పట్టించుకోలేదన్నారు. ఏజెన్సీని మార్చి, ఆఫీసర్లను మార్చి రెండు సంవత్సరాలు పట్టించుకోలేదని.. దీంతో డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయిందన్నారు. 9వేల కోట్లు కరెంటు వాడుకోకుండా వారికి బకాయిలు కట్టారన్నారు. 7. 25 పైసలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కరెంట్ కొన్నారన్నారు. ఇసుకపైనా వ్యాపారం చేశారని.. దోపిడీ చేశారని ఆరోపించారు. రూ.30 వేల కోట్లు ఇసుకలో దోపిడీ చేశారన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయినా మాకు ఓ టీవీ, పత్రిక లేవని.. అవినీతి అక్రమాల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వారు.. వస్తూనే టీవీ, పత్రిక పెట్టుకుని పార్టీ పెట్టుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పు రూ. 9,74,556 కోట్లుగా ఇప్పటికి తేలిందన్నారు. ఇప్పుడు తలసరి అప్పు 1.44 లక్షలుగా ఉందన్నారు. మా ప్రభుత్వం ఏదీ దాచటం లేదని.. అందుకే అన్ని జీవోలనూ బహిర్గతం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోలను కూడా ఆన్ లైన్లో పెడుతున్నామన్నారు.
……………………………………