
* ఆర్థిక పరిస్థితి బాగా లేక పోయినా రైతులకు ప్రోత్సాహం
* నాణ్యమైన ఎరువులు, విత్తనాల పంపిణీ
* ప్రతీ ఎకరాకి 12వేలు ఇస్తాం
* ప్రతీ నీటిబొట్టును ఒడిసిపడతాం
* ఏరువాకలో మంత్రి పొంగులేటి
* దుక్కిదున్ని విత్తనాలు వేసిన మంత్రి
ఆకేరు న్యూస్ ఖమ్మం : ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులందరికీ శుభాకాంక్షలు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏర్పాటు చేసిన
ఏరువాక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఏరువాకలో ఆయన దుక్కి దున్ని విత్తనాలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతులకు ప్రోత్సాహం అందించడంలో రాజీ పడడం లేదన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో 17 వందల కోట్లు రుణ మాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందజేస్తున్నామన్నారు.రైతు భరోసా ఇప్పటికే రెండుసార్లు ఇచ్చామని రేపటి నుండి మళ్లీ రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పారు. వ్యవసాయయోగ్యమైన ప్రతీ ఎకరాకు 12 వేల చొప్పున చెల్లిస్తామని మంత్రి అన్నారు. దేశంలో ఇప్పటికే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ నీటి బొట్టు ప్రజలకు ఉపయోగపడేలా ఒడిసి పట్టుకుంటామని దాని కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి అన్నారు. అంతకు మందు మంత్రి రైతులతో కలిసి పొలంలో దుక్కి దున్ని విత్తనాలు నాటారు. రైతులతో కలసి గడపడం తనకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.
…………………………………………………