
* 12 రోజుల విధ్వంసానికి ఫుల్స్టాప్
* ఇరాన్ – ఇజ్రాయొల్ మధ్య యుద్ధానికి ముగింపు పడిందని ట్రంప్ ప్రకటన
* ఇరాన్ అధికారిక చానల్లోనూ వెల్లడి
ఆకేరు న్యూస్, డెస్క్ : ఇరాన్ – ఇజ్రాయొల్ (Israel-iran ceasefire) మధ్య యుద్ధం ముగిసింది. 12 రోజులుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇందుకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు కూడా తెలిపారు. ‘ఇకపై అంతా అనుకున్నట్టే జరుగుతుందని భావిస్తున్నా.. జరుగుతుంది కూడా. ఈ 12 రోజుల యుద్ధాన్ని ముగించినందుకు.. ముగించే ధైర్యసాహసాలు, ఇంటెలిజెన్స్ను కనబరిచిన ఇరు దేశాలకు శుభాకాంక్షలు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. కాల్పుల విమరణ దశలవారీగా జరుగుతుందని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తొలుత ఇరాన్ (Iron) కాల్పుల విరమణ ప్రారంభిస్తుందని, ఆ తరువాత 12 గంటలకు ఇజ్రాయెల్ కూడా దాడులను ఆపేస్తుందని అన్నారు. ఇజ్రాయెల్కు తోడుగా అమెరికా (America) కూడా దాడులకు దిగడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. అమెరికా బాంబర్లు ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ తరుణంలో ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ఇరాన్ అధికారిక చానల్లోనూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. అయితే, ఇరాన్ మళ్లీ దాడులకు దిగనంతకాలం కాల్పుల విరమణ తమకు అంగీకారమేనని ఇజ్రాయెల్ పేర్కొన్నట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
………………………………………………..