
* అదే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ!
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నారంటూ చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు పదే పదే విమర్శిస్తుంటాయి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నింస్తుటాయి. విపక్షాలు ఎందుకలా విమర్శిస్తున్నాయి.. ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగింది.. అసలు ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది.. అనే వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. అది 1975, జూన్ 25. స్వాతంత్ర భారతదేశంలో చీకటి రోజుగా మిగిలిపోయింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఆ కాలంలో బలమైన నేతగా ఉండేవారు. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఆమె చెప్పిందే వేదం. ఆమె చేసేదే శాసనం. నాటి విధానాలతో ఇబ్బందులు తలెత్తాయి. క్రమేణా ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి పెరిగాయి. దీంతో ప్రజల్లో నిరసనలు ఊపందుకున్నాయి.
ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని చెప్పడంతో..
1974లో రైల్వే సమ్మె, బీహార్లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం దేశాన్ని కుదిపేశాయి. దీంతో కొన్ని పార్టీలు కలిసి జనసంఘ్ గా ఏర్పడ్డాయి. ఈ సమయలోనే రాయబరేలీ నుంచి ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదంటూ ఆమె ప్రత్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని బెదిరింపులతో ఆమె గెలిచారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడం సంచలనంగా మారింది. కోర్టు తీర్పుతో ఆగ్రహంతో రగిలిపోయిన ఇందిరా గాంధీ 1975 జూన్ 25 అర్థరాత్రి ఎమర్జెన్సీ విధించారు. 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీ పాలన సాగింది. ఈ సమయంలో ప్రతిపక్షనేతలు, వామపక్ష నాయకులు, సామాన్య ప్రజలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రజా ఆగ్రహంతో ఎట్టకేలకు ఎమర్జెన్సీ తొలగించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
ఎమర్జెన్సీ రోజుల్లో.. మహానగరంలో..
కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ముషీరాబాద్, చంచలగూడ జైళ్లు నిండిపోయాయి. రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. నిరసనలు, ధర్నాలు ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం. నగరానికి చెందిన ఎంటీ ఖాన్, కేశవరావు జాదవ్, బండారు దత్తాత్రేయ, ఆలె నరేంద్రతో పాటు ఆనందమార్గం, జమాతె ఇస్లామీ హింద్ సంస్థల నాయకులనూ వదల్లేదు. కొంత మంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారికి బస్తీలు ఆవాసం కల్పించాయి. సంజీవరెడ్డి నగర్, ఆసిఫ్నగర్, మలక్పేట, పాతనగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోని పేదల వాడలు నాయకులకు ఆశ్రయం కల్పించాయి. అన్నం పెట్టాయి. కొన్నిసందర్భాల్లో పోలీసుల హింసకుసైతం ఓర్చి, ఉద్యమకారుల జాడబయటకు తెలియకుండా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి నగర బస్తీ వాసులు ఎందరో బాసటగా నిలిచారు. ఆ చీకటి కాలంలో కూడా రవీంద్రభారతి, త్యాగరాయగానసభ మాత్రం నిత్యం కళకళలాడుతుండేవి. సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణ సభలు నిరంతరాయంగా కొనసాగుతుండేవని రసమయి వ్యవస్థాపకుడు ఎంకే రాము తెలిపారు. అయితే కార్యక్రమంలో పాల్గొనే వక్తలు, వారి వివరాలను ముందుగా పోలీసు కమిషనర్ కార్యాలయానికి అనుమతి తప్పనిసరి అని వివరించారు. నిర్భంధంతో కూడిన ఆ చీకటి రోజులను ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటారు. నియంతృత్వ ధోరణికి నిదర్వనంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి.
……………………………………………………..